Rahul Gandhi: రుజువులు అక్కర్లేదు.. దిగ్విజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్‌ గాంధీ

సర్జికల్‌ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఖండించారు. సాయుధ దళాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

Published : 24 Jan 2023 14:29 IST

దిల్లీ: మెరుపుదాడుల(సర్జికల్‌  స్ట్రైక్స్‌)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన సైనికులను కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తోందంటూ భాజపా నేతలు దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దీనిపై స్పందిస్తూ.. దిగ్విజయ్‌ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని తెలిపారు.

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్‌.. నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను మేం అభినందించట్లేదు. అవి విరుద్ధమైనవి. వీటితో పార్టీకి సంబంధం లేదు. పార్టీ అభిప్రాయాలు చర్చల నుంచే వెలువడుతాయి. మన సాయుధ బలగాల సామర్థ్యం మాకు తెలుసు. వారు అసాధారణ విధులు నిర్వర్తించగలరని మేం స్పష్టంగా ఉన్నాం. వాళ్లు ఎలాంటి రుజువులు చూపించాల్సిన అవసరం లేదు’’ అని రాహుల్‌ వెల్లడించారు. అటు కాంగ్రెస్‌ (Congress) పార్టీ కూడా దిగ్విజయ్‌ వ్యాఖ్యలకు స్పందించకుండా దూరం జరిగింది.

నాలుక్కర్చుకున్న దిగ్విజయ్‌..

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్‌ (Digvijaya Singh) సోమవారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెరుపుదాడులు (సర్జికల్‌  స్ట్రైక్స్ Surgical Strikes‌) చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు చూపించలేకపోతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు. పుల్వామా ఘటనపైనా ప్రభుత్వం ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీయడంతో దిగ్విజయ్‌ దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. రక్షణ దళాల పట్ల తనకు గొప్ప గౌరవం ఉందంటూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని