దుబ్బాక: 3,020 ఓట్ల ఆధిక్యంలో భాజపా

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన ఫలితాలను బట్టి తొలి ఐదు రౌండ్లలోనూ భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. ..

Updated : 10 Nov 2020 11:51 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన ఫలితాలను బట్టి తొలి ఐదు రౌండ్లలోనూ భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి భాజపా 16,517, తెరాస 13,497, కాంగ్రెస్‌ 2,724 ఓట్లు పోలయ్యాయి. భాజపా ప్రస్తుతం 3,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భాజపా హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై భాజపా సీనియర్‌ నేత రామ్‌ మాధవ్‌ స్పందించారు. భాజపా తెలంగాణ శ్రేణుల శ్రమకి తగ్గ ఫలితం వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. 

 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది. దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని