Eatala Rajender: తెరాసలో ఉంటే మంచోళ్లు.. భాజపాలో చేరితే కేసులా?: ఈటల రాజేందర్
భాజపాలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భాజపా కార్యాలయంలో
హైదరాబాద్: భాజపాలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదన్నారు.
‘‘భాజపాలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా భాజపాలో చేరే నాయకులను ఆపలేరు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. తెరాసలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవు. చౌటుప్పల్ ఎంపీపీ భాజపాలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారు. కేసులు పెట్టి భయపెడుతున్నారు. మీరు చేసిన తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం. కూలి పని చేసుకుని జీవనం సాగించే భాజపా కార్యకర్తలను కూడా వదలట్లేదు. వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.