Munugode Bypoll: గుర్తు మార్పు.. మునుగోడు రిటర్నింగ్‌ అధికారిపై ఈసీ వేటు

మునుగోడు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో కోసం 3పేర్లను అధికారులు ఈసీకి పంపించారు. సాయంత్రంలోగా కొత్త రిటర్నింగ్‌ అధికారి నియామక ఉత్తర్వులు వెలువడేందుకు అవకాశం ఉంది.

Published : 20 Oct 2022 13:41 IST

దిల్లీ: మునుగోడు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుర్తులు మార్చాలనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకొని ఇవాళ సాయంత్రంలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీ ఆదేశించింది. ఈలోగా ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపించారు. సాయంత్రంలోగా కొత్త రిటర్నింగ్‌ అధికారి నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తర్వాత బేబీ వాకర్‌ గుర్తు ఇచ్చారంటూ ఇటీవల యుగతులసి పార్టీ అభ్యర్థి కె. శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందిస్తూ.. గుర్తు మార్పు విషయాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తు మార్పును ఈసీ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఫారం 7(ఏ)ను ఎన్నికల అధికారులు సవరించి శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. గెజిట్‌ జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆర్వోపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని