Errabelli Pradeep Rao: తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెరాసను వీడారు....

Updated : 07 Aug 2022 17:25 IST

వరంగల్‌: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెరాసను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాసకు రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. మ కార్యకర్తలకు తెరాస ఏమీ చేయలేదు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశా. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారు. ఆయన తిట్టినా తెరాస నాయకులు ఎవరూ దాన్ని ఖండించలేదు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తా.. లేదంటే స్వతంత్రంగా ఉంటా’’ అని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చెప్పారు. 

ప్రదీప్‌రావు భాజపాలో చేరడం ఖాయమని.. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని