ఎగ్జిట్‌పోల్స్‌.. మహా కూటమి వైపే మొగ్గు!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు...

Updated : 08 Nov 2020 12:03 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్‌నౌ- సి ఓటర్‌, పీపుల్స్‌ పల్స్, ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ వంటి సంస్థలు మహా కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ- సి ఓటర్‌ పేర్కొంది. ఇక పీపుల్స్‌ పల్స్‌ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్‌కు 44 శాతం మంది మద్దతు తెలపగా.. నీతీశ్‌ కుమార్‌కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్‌ పాస్వాన్‌కు 7 శాతం మంది ఓటేశారు.

ఇతర సర్వేలు సైతం మహా కూటమికే ఆధిక్యం చూపించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి ఫలానా కూటమికే వస్తుందని పేర్కొనక పోవడం గమనార్హం. దీంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఎల్జేపీ, ఇతరులు కీలకంగా మారొచ్చు. మొత్తం మూడు దశల్లో 243 స్థానాలకు గానూ బిహార్‌లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జేడీయూ, భాజపా ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీయే మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన మహా కూటమి గట్టి పోటీనిస్తోంది. చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. తుది ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇలా..

మధ్యప్రదేశ్‌ ఫలితాలు

మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు సైతం వెలువడ్డాయి. కాంగ్రెస్‌కు 16-18, భాజపాకు 10-12, ఇతరులు 0-2 స్థానాలు వస్తాయని ఆజ్‌తక్‌ పేర్కొంది. జ్యోతిరాధిత్య సింథియా తన అనుచరులతో కలిసి భాజపాలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని