Buggana RajendraNath: మంత్రి బుగ్గన చెప్పేవన్నీ పిట్టకథలేనా?.. డోన్‌లో ఫ్లెక్సీలు

కర్నూలు జిల్లా డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది.

Updated : 16 Nov 2022 16:28 IST

డోన్‌: కర్నూలు జిల్లా డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. పట్టణ సమీపంలోని రుద్రాక్షగుట్ట వద్ద పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం చేపట్టిన నిరసనలో భాగంగా బుధవారం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.‘‘రాష్ట్ర అసెంబ్లీలో పిట్టకథలు చెప్పే బుగ్గన.. రుద్రాక్ష గుట్ట బాధితులకు చెప్పేది కూడా పిట్టకథలేనా?’’ అనే నినాదంతో వీటిని ఏర్పాటు చేశారు. 

‘‘డోన్‌ పట్టణంలోని రుద్రాక్ష గుట్టలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా దౌర్జన్యంగా కూల్చివేసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించండి!. రుద్రాక్ష గుట్ట పేదలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసించండి! రాష్ట్ర మంత్రిగా ‘మాట’ ఇచ్చి పేద ప్రజలను మోసం చేసిన బుగ్గన తీరును గమనించండి!’’ అని ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్‌ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు కూడా పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని