BJP: భాజపాలోకి కాంగ్రెస్‌ నేత.. చేరిన రోజే జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు

కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌.. భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు కూడా కాషాయ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.

Published : 03 Dec 2022 01:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నుంచి ఈ ఏడాది భాజపాలో చేరిన సీనియర్‌ నేతలకు కాషాయ పార్టీలో కీలక పదవులు దక్కాయి. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత సునీల్‌ జాఖఢ్‌ను జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోకి తీసుకోగా.. కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. కాగా.. భాజపాలో చేరిన రోజే.. జైవీర్‌కు జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు దక్కడం గమనార్హం.

మూడు నెలల కిందటే కాంగ్రెస్‌కు రాజీనామా..

సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న 39 ఏళ్ల జైవీర్‌ షెర్గిల్‌.. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ నేషనల్‌ మీడియా ప్యానెలిస్ట్‌లో అత్యంత పిన్క వయస్కుడు ఈయనే. పంజాజ్‌ కాంగ్రెస్‌లో కీలక నేతల్లో ఒకరైన జైవీర్‌.. ఈ ఏడాది ఆగస్టులో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన వార్తల్లోకెక్కారు. హస్తం పార్టీ కొందరి కోసం మాత్రమే పనిచేస్తోందని గాంధీ కుటుంబంపై బహిరంగ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అన్నట్లుగానే శుక్రవారం (డిసెంబరు 2)న ఆయన భాజపాలో చేరడమే గాక.. తొలి రోజే జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు అందుకున్నారు.

కీలక కమిటీలో కెప్టెన్‌కు చోటు..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్ జాఖఢ్‌ను జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా నియమిస్తూ భాజపా నేడు ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య పోరుతో తలెత్తిన విభేదాల కారణంగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్.. గతేడాది హస్తం పార్టీతో దశాబ్దాల పాటు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి.. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కెప్టెన్‌ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఈ ఏడాది సెప్టెంబరులో భాజపాలో చేరిన అమరీందర్‌ సింగ్‌.. తన పీఎల్‌సీ పార్టీని కూడా కాషాయ పార్టీలో విలీనం చేశారు. సునీల్‌ జాఖఢ్‌ కూడా ఈ ఏడాది మే నెలలో హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని