Sunil Jakhar: భాజపాలో చేరిన సునీల్‌ జాఖఢ్‌

సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖఢ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు

Published : 19 May 2022 14:55 IST

దిల్లీ: కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖఢ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నడ్డా ఆయనకు సాదర స్వాగతం పలికారు. జాఖఢ్‌ ఎంతో అనుభవమున్న రాజకీయ నేత అని నడ్డా కొనియాడారు. పంజాబ్‌లో పార్టీ బలోపేతమవడంతో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం జాఖఢ్‌ మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా తమ కుటుంబంలోని మూడు తరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేశామని గుర్తుచేశారు. అయితే జాతీయవాదం, ఐకమత్యం తదితర అంశాల కారణంగా కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తాను తెంచుకున్నట్లు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్‌ను వీడలేదని, పంజాబ్‌ను రక్షించేందుకే తాను ఆ పార్టీ నుంచి వైదొలిగినట్లు తెలిపారు.

సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించి..

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని లక్ష్యంగా చేసుకుని సునీల్‌ జాఖఢ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ ఛానల్‌లో జాఖఢ్‌ మాట్లాడుతూ.. అమరీందర్‌ రాజీనామా తర్వాత ఆ స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం చన్నీని నియమించడాన్ని ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జాఖఢ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత కూడా ఆయన చన్నీపై విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే ఆయనపై కొందరు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, జాఖఢ్‌ను రెండేళ్ల పాటు అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన జాఖఢ్‌ ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత సీఎం రేసులో జాఖఢ్‌ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఎన్నికల దృష్ట్యా సిక్కు వ్యక్తిని సీఎం చేయాలని కొందరు పార్టీ నేతలు సూచించడంతో చన్నీని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటి నుంచే జాఖఢ్‌ కలత చెందారని తెలుస్తోంది.

వారి కుటుంబం.. 50 ఏళ్లుగా కాంగ్రెస్‌తోనే..

జాఖఢ్‌ కుటుంబం 50 ఏళ్లుగా కాంగ్రెస్‌కు పనిచేస్తోంది. సునీల్‌ తండ్రి బలరాం జాఖఢ్‌ కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికవ్వడమే గాక.. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1980 నుంచి 1989 మధ్య వరుసగా తొమ్మిదేళ్ల పాటు సభాపతిగా ఉన్న ఆయన.. లోక్‌సభకు సుదీర్ఘకాలం స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు. ఇక సునీల్‌ జాఖఢ్‌ పంజాబ్‌లోని అబోహర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని