
‘ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోంది’
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు విమర్శించారు. అప్పట్లో దిల్లీ సుల్తానుల్లోని మహ్మద్బిన్ తుగ్లక్ కూడా రాజధానిని మార్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైకాపా తీరు కూడా అలానే ఉందని ఎద్దేవా చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విజయనగరంలో తెదేపా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అశోక్ బంగ్లాలో జరిగిన ఈ సమావేశానికి అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ సభ్యుడు రామారావుతో పాటు అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పలు పార్టీలకు చెందిన నాయకులంతా తీర్మానించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఉత్తరాంధ్ర వాసిగా తాను వ్యతిరేకిస్తున్నట్లు మాజీ మంత్రి సుజయ్కృష్ణ రంగారావు స్పష్టంచేశారు. అమరావతి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.