దిల్లీకి జనసేన అధినేత పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తినకు పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా...

Updated : 11 Jan 2020 13:26 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తినకు పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన దిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమయ్యేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో పవన్‌ కల్యాణ్‌ ఇవాళ సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుండగానే..హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దిల్లీ బయల్దేరారు. నిన్న సాయంత్రం అమరావతి రైతులతో సమావేశం సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశానికి సంబంధించి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులను కేంద్రమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈనేపథ్యంలోనే రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సమావేశమయ్యేందుకు పవన్‌ దిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర ముఖ్య నేతలలో ఎవరితో పవన్‌ భేటీ అవుతారనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని