వికేంద్రీకరణ బిల్లుపై కౌన్సిల్‌లో మల్లగుల్లాలు

వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రూల్‌ 71 కింద తెదేపా ఇచ్చిన నోటీసుపై రెండు గంటలపాటు...

Updated : 21 Jan 2020 14:10 IST

అమరావతి: వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రూల్‌ 71 కింద తెదేపా ఇచ్చిన నోటీసుపై రెండు గంటలపాటు చర్చ జరపాలని మండలి ఛైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలని సూచించారు. స్పీకర్‌ రూలింగ్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ‘‘ఇది ఒక సంప్రదాయంగా మిగిలిపోతుంది. బిల్లులు ప్రవేశ పెట్టిన ప్రతిసారి రూల్‌ 71 తెరమీదకు తెస్తారు. ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా భావించి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఈ రూల్‌ను తెరమీదకు తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రూల్‌ 71పై చర్చకు ముందే బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించగా... అడ్డుకొనేందుకు తెదేపా సభ్యులు వ్యూహం పన్నారు. ఈ క్రమంలో సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన తర్వాత తెదేపా సభ్యుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడాలని ఛైర్మన్‌ సూచించారు. దీంతో ఛైర్మన్‌ పోడియం వద్ద మంత్రులు ఆందోళనకు దిగడంతో సభ మరోసారి వాయిదా పడింది.

మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కింద ప్రభుత్వం బిల్లను ఆమోదింప చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు భావిస్తున్నారు. శాసన మండలిలో వ్యూహం విఫలమైతే కౌన్సిల్‌ రద్దు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు సమాచారం. కౌన్సిల్‌ రద్దుతో లాభ, నష్టాలను వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాత్రికి రాత్రే సాధ్యం కాదు...
శాసనమండలి రద్దు చేయాలంటే రాత్రికి రాత్రే సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. మంత్రివర్గం తీర్మానం చేసి దానిని అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్‌కు పంపాల్సి ఉంటుంది. మండలి రద్దు తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సిఫార్సు మాత్రమే చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్‌ ఆమోదించాకే అధికారికంగా రద్దవుతుందని భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని