మండలిలో నెగ్గిన తెదేపా పంతం!

ఏపీ శాసన మండలిలో తెదేపా పంతం నెగ్గింది. రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది.

Updated : 21 Jan 2020 20:14 IST

అమరావతి: ఏపీ శాసన మండలిలో తెదేపా పంతం నెగ్గింది. రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. ఛైర్మన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్‌ 71పై చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లులను పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 71పై చర్చ ప్రారంభించాలని సూచించారు. తెదేపా సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంభించారు. రూల్‌ 71పై చర్చకు తెదేపాకు రెండు గంటల సమయాన్ని ఛైర్మన్‌ కేటాయించారు. మరోవైపు మండలిలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటుండటంతో గ్యాలరీలు ఎమ్మెల్యేలతో నిండిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి మండలి సమావేశాలను తిలకిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని