ఇక ఎన్నికలు పెట్టడం ఎందుకు?: ఉత్తమ్‌

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. అక్రమాలతో ఛైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి తెరాస ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతానికి

Updated : 28 Jan 2020 17:28 IST

నేరేడుచర్ల పురపాలిక సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌


నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. అక్రమాలతో ఛైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి తెరాస ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతానికి సంబంధంలేని వ్యక్తిని ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా చేర్చారని విమర్శించారు.

సమావేశం జరుగుతున్న సమయంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల పరీశీలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుటే ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఇరుపార్టీలు ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం తెరాస సభ్యులతోనే సమావేశం నడుస్తోంది.

అంతకుముందు ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డిని ఎక్స్‌అఫిషియో జాబితాలో చేర్చడంపై  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఖండించారు. ఎస్‌ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలే నిర్వహించకపోతే  పోటీ ఉండేది కాదు కదా అని మండిపడ్డారు.  ‘‘కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నెరేడుచర్ల మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనం. 25వ తేదీ వరకే ఎక్స్‌అఫిషియో సభ్యుల నమోదు జరగాలని నిబంధనలు ఉన్నాయి. ఈ రోజు నేరేడుచర్ల మున్సిపల్ సభ్యులుగా ఎమ్యెల్సీ సుభాష్ రెడ్డి పేరు నమోదు చేయిస్తున్నారు. ఇది అక్రమం, నిబంధనలకు విరుద్ధం. ఇక ఎన్నికలు ఎందుకు.. కేటీఆర్ ఇంట్లో కూర్చుని రాసుకుంటే సరిపోతుంది కదా..?’’ అని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.

‘‘నిన్న నేరేడుచర్ల మున్సిపల్‌ ఛైర్మెన్ ఎన్నికల వ్యవహారాన్ని ప్రారంభించారు. ఇద్దరు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. అప్పుడు ఎమ్యెల్యే గొడవ చేసి వాయిదా వేయించారు. ఇప్పుడు కొత్తగా సభ్యులను నమోదు చేయిస్తున్నారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ఠ. 25వ తేదీ లోపు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేయించాలని నాకే స్వయంగా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ చెప్పారు, మరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కొంత జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తసభ్యుల నమోదు ఏంటి..? ఇంత దారుణ అక్రమాలు ఉంటాయా..? రాష్ట్రంలో కేటీఆర్ అక్రమాలు శ్రుతి మించిపోయాయి.. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, ప్రజలు గమనించాలి, అర్థం చేసుకోవాలి’’అని ఉత్తమ్‌కుమార్‌  అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని