ఏపీ శాసన సభ, మండలి ప్రొరోగ్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Updated : 13 Feb 2020 20:39 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా..దానికి సభ ఆమోదం తెలిపింది. మరోవైపు సీఆర్డీఏ రద్దుపైనా సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. అయితే ఆ రెండు బిల్లులూ శాసన మండలిలో ఆమోదం పొందలేదు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపిస్తూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మండలి ఛైర్మన్‌ వ్యవహరించిన తీరును తెదేపా సమర్థిస్తుండగా.. వైకాపా వ్యతిరేకిస్తోంది. ఆ రెండు బిల్లులకు సంబంధించి సెలక్ట్‌ కమిటీ సభ్యులను మండలి ఛైర్మన్‌ ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం సెలక్ట్‌ కమిటీల ఏర్పాటు కుదరదంటూ దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్‌ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే సెలక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆయన ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఉభయ సభలను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయడంతో ఆ బిల్లుల స్థానంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని