పోలీసుల అదుపులో సిద్ధరామయ్య..!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నాయకులు దినేశ్‌ గుండూరావు, రిజ్వాన్‌ అర్షద్‌, కె.సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్‌ పాఠశాల దేశద్రోహం.........

Published : 15 Feb 2020 15:03 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నాయకులు దినేశ్‌ గుండూరావు, రిజ్వాన్‌ అర్షద్‌, కె.సురేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్‌ పాఠశాల దేశ ద్రోహం కేసుకు నిరసనగా వారు బెంగళూరులోని ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తల్లీపిల్లల్ని వేరుచేయడం అమానవీయం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థని భాజపా ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు. ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

బీదర్‌లోని శాహిన్‌ పాఠశాలలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన  జిల్లా న్యాయస్థానం పోలీసుల చర్యని తప్పుబట్టింది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, హోంశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాటకంలో సంభాషణలు రాసిన ఒక విద్యార్థిని తల్లి అనుజా మిన్సా, ఉపాధ్యాయురాలు ఫరీదా బేగానికి బీదర్‌లోని న్యాయస్థానం శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. రెండు వారాలుగా వారిద్దరూ అక్కడి కారాగారంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని