ధాన్యం డబ్బులింకా చెల్లించరేం?: పవన్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రైతులు పంట అమ్ముకొని...

Updated : 18 Feb 2020 18:37 IST

అమరావతి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రైతులు పంట అమ్ముకొని వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ము రాక  రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈరోజు వరకు రూ.2016 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.

లక్ష మందికి పైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులుపడుతుంటే సంబంధిత శాఖలేం చేస్తున్నాయని పవన్‌ నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరిచిపోయిందని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా సొమ్ము చేతికి రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఖరీఫ్‌ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని