జగన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో?: రాజా

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. విజయవాడలో పర్యటిస్తున్న ఆయనను...

Published : 22 Feb 2020 00:23 IST

విజయవాడ: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. విజయవాడలో పర్యటిస్తున్న ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిసి అమరావతి సంక్షోభాన్ని వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వని రీతిలో  ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఏపీలో ఎందుకని ప్రశ్నించారు.

ప్రజలతో పోరాటమా?

ప్రజలతో పోరాడటం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాలని రాజా సూచించారు. ప్రజాస్వామ్యంలో  ప్రజలు, రాజకీయ పార్టీల గొంతుకను ప్రభుత్వం వినాలనీ.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రజల, రాజకీయ పార్టీల గొంతు ప్రభుత్వానికి వినపడట్లేదని ఆరోపించారు. నిరసనకారులు, మహిళలపై దాడులను తమ పార్టీ తరఫున ఖండిస్తున్నట్టు చెప్పారు.  మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని రాజా స్పష్టంచేశారు. రాజధానిగా అమరావతే ఉండాలన్నది తమ నిశ్చితాభిప్రాయమన్నారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని