విశాఖ ఘటనపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు

విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం శనివారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌ను

Updated : 29 Feb 2020 19:50 IST

అమరావతి: విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం శనివారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం  సీనియర్‌ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉందనడానికి విశాఖ ఘటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినా... పర్యటనను అడ్డుకోవాలనిమంత్రి అవంతితో కలిసి మరో మంత్రి బొత్స పిలుపునిచ్చారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్ర కొనసాగనివ్వకూడదని డీజీపీకి జగన్ఆదేశాలిచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందు రోజు సీఎం జగన్‌తో డీజీపీ ఎందుకు సమావేశమయ్యారని నిలదీశారు. ఈ విషయాలన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, విశాఖ ఘటనకు సంబంధించిన వివరాలుతనకు తెలుసని గవర్నర్ చెప్పారని వర్ల రామయ్య తెలిపారు. 

 మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ..చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. చంద్రబాబును అడ్డుకున్నది విశాఖ ప్రజలు కాదని, 13 జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ గూండాలని విమర్శించారు. రేప్ కేసులు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తోన్న పోలీసు అధికారులు సమాధానం చెప్పుకునే రోజు వస్తుందన్నారు. హుద్ హూద్ ఘటనతో నష్టపోయిన విశాఖను చంద్రబాబే ఆదుకున్నారని విశాఖ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ... పరిపాలన చేతకాని ప్రభుత్వం  పోలీస్ వ్యవస్థను ఎందుకూ పనికి రాని వ్యవస్థగా మార్చిందని విమర్శించారు. పోలీసులు నేమ్ ప్లేట్లు తీసేసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.  విశాఖ ఘటనలో కిరాయి గుండాలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని