కాంగ్రెస్‌కు సింధియా రాజీనామా

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాన మంత్రి మోదీతో సింధియా

Updated : 10 Mar 2020 16:42 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వానికి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ ఉదయం మోదీని కలిసిన అనంతరం సింధియా తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సింధియా తన.. వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరు వెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సింధియా నేడు ప్రధానిని కలవడంతో రాష్ట్రంలో కమల్‌నాథ్‌ సర్కార్‌ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సింధియా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ.. రాజీనామా లేఖను పోస్ట్‌ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయన భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

‘గత 18ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీతో ఉన్నా. ఇక వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్‌తో కలిసి ఉంటే రాష్ట్ర, దేశ ప్రజలకు సేవల చేయలేనేమో అని అనిపిస్తోంది. నా ప్రజలు, నా కార్యకర్తల ఆశల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే ఉత్తమమని భావిస్తున్నా. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీకి, సహ నేతలకు కృతజ్ఞతలు’ అని సింధియా లేఖలో పేర్కొన్నారు. 

అటు మధ్యప్రదేశ్‌లోనూ సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. అదే జరిగితే అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యాబలం తగ్గి కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి.. 

మోదీని కలిసిన సింధియా

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని