సీఎం పదవిపై వ్యామోహం లేదు: రజనీ

పదవుల కోసం తాను ఎన్నడూ ఆశపడలేదని, కేవలం వ్యవస్థలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌

Updated : 12 Mar 2020 12:32 IST

కోడంబాక్కం(చెన్నై): పదవుల కోసం తాను ఎన్నడూ ఆశపడలేదని, కేవలం వ్యవస్థలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

‘గతవారం నేను రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశమయ్యా. ఓ విషయంలో అసంతృప్తిగా ఉన్నానని ఆ సమావేశంలో చెప్పా. ఆ తర్వాత దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వడానికే వచ్చా. 1996కు ముందు ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు. దీని గురించి ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం మొదటిసారిగా చెప్పా. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించా. డీఎంకే, అన్నాడీఎంకే వంటి గొప్ప పార్టీలతో ఢీకొనడం మామూలు విషయం కాదు. అయితే జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండుల మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించింది. ఇలాంటి తరుణంలో వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదు’ అని రజనీ చెప్పుకొచ్చారు. 

సీఎం పదవిపై వ్యామోహం లేదు..

45 సంవత్సరాలుగా తాను సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావితం చేస్తుందని రజనీ ఈ సందర్భంగా అన్నారు. అయితే తనకు సీఎం పదవిపై ఏనాడూ వ్యామోహం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. ‘నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు.. నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా?. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను. సీఎం అభ్యర్థిని తయారుచేస్తాను అని ప్రజలకు స్పష్టం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం’ అని వివరించారు. 

యువతకు ప్రాధాన్యం..

అధ్యక్షుడిగా ఉంటూ పార్టీపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజల మనసులో ప్రేమ, నిజాయతీ ఉన్నవాళ్లకే సీఎం స్థానం దక్కుతుందని తెలిపారు. రాజకీయాల్లో విద్యా ప్రమాణాలు, వయస్సు కూడా ముఖ్యమేనని రజనీ అన్నారు. అందుకే తాను స్థాపించబోయే పార్టీలో 60 నుంచి 65శాతం యువకులకే అవకాశం ఇస్తానని చెప్పారు. యువతతో పాటు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ప్రజలకు అన్నలా ఉండే నాయకులను తయారుచేయడమే తన లక్ష్యమని రజనీ వివరించారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని