నా ఏకైక లక్ష్యం అదే: సింధియా

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే తన ఏకైక లక్ష్యమని భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బుధవారం మధ్యాహ్నం భాజపాలో చేరిన అనంతరం గురువారం సాయంత్రం తొలిసారి భోపాల్‌కు........

Published : 13 Mar 2020 01:18 IST

భోపాల్‌: ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే తన ఏకైక లక్ష్యమని భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బుధవారం మధ్యాహ్నం భాజపాలో చేరిన అనంతరం గురువారం సాయంత్రం తొలిసారి భోపాల్‌కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనకు భోపాల్‌లో అపూర్వ స్వాగతం పలికిన మిత్రులు, కుటుంబ సభ్యులు, భాజపా శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తనకు ఎంతో భావోద్వేగమైన రోజు అన్నారు. ఎవరికైనా గౌరవం, గుర్తింపు అనేది ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు. భాజపాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన కోసం పార్టీ తలుపులు తెరిచారని చెప్పారు. ఈ స్వాగత కార్యక్రమంలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో కలిసి నడిచిన సింధియా బుధవారం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు రాజీనామా చేయడంతో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. మరోవైపు, సింధియా భాజపాలో చేరిన రోజు ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాషాయ పార్టీ ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని