‘చమురు’ ప్రయోజనాలు బదిలీ చేయండి

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయకుండా పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచడాన్ని కాంగ్రెస్‌ పార్టీ....

Published : 15 Mar 2020 01:35 IST

దిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయకుండా పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. ఆ ప్రయోజనాలను వెంటనే ప్రజలకు బదిలీ చేయాలని కోరింది. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలను కనీసం 35-40 శాతం తగ్గించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో పార్లమెంట్‌ లోపలా, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో శనివారం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో రూ.39వేల కోట్లు సుమారు ఖజానాకు చేరనుంది. తాజా పెంపుతో ఎక్సైజ్‌ సుంకం పెట్రోల్‌పై రూ.22.98కి, డీజిల్‌పై రూ.18.83కి చేరిందని మాకెన్‌ తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సుమారు డజను సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచిందని విమర్శించారు. పెట్రో ఉత్పత్తులనూ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను సైతం దోచుకుంటోందని తప్పుబట్టారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు 2004 జూన్‌-జులై నాటి ధరలకు చేరువయ్యాయని, అందుకు తగ్గుట్టుగా ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అటు మోదీ ప్రభుత్వం, ఇటు ఆయిల్‌ కంపెనీలు పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నాయని మాకెన్‌ ఆరోపించారు.

ఇదీ చదవండి..
పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని