అకాలవర్షంతో రైతులకు తీవ్ర నష్టం: పవన్‌

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో...

Published : 27 Apr 2020 00:09 IST

హైదరాబాద్‌: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన, కల్లాల్లో ఉన్న పంట నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న వరి రైతులకు ప్రభుత్వం ఉపశమన పథకాలు అమలు చేయాలని కోరారు.  రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రావడంతో స్థానిక రైతులకు మద్దతు ధర రావడం లేదని తెలిపారు. అలా ధాన్యం రాకుండా కట్టడి చేయాలని సూచించారు.

నీటి తీరువా పెంపు సరికాదు

కరోనాతో పాటు అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు కేటాయించారని... ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువా పన్ను  రెట్టింపు చేయాలనే ఆలోచన సరికాదని అన్నారు. గిట్టుబాటు ధరలు, మార్కెట్‌ సదుపాయం లేక ఇబ్బందుల్లో ఉన్న రైతుల పొలాలకు నీటి తీరువాను పెంచాలనుకోవడం తగదని... పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పవన్‌కల్యాణ్‌ ప్రభుత్వానికి  సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని