వలస కార్మికులకే తొలి ప్రాధాన్యం: ఆళ్ల నాని

ఏపీకి చెందిన 2లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది ఏపీలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే

Updated : 04 May 2020 02:22 IST

విజయవాడ: ఏపీకి చెందిన 2లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది ఏపీలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. విజయవాడలో రాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో దశలో విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులను తరలిస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 9 రైళ్ల ద్వారా రాష్ట్రానికి చెందిన కూలీలను తీసుకొస్తామని వివరించారు. గ్రామ సచివాలయంలో ఒకటి చొప్పున లక్ష పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చేలోపు క్వారంటైన్లను సిద్ధం చేస్తామని తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నచోట 500 బస్సుల ద్వారా నిత్యావసరాలను విక్రయిస్తామన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటికి ఒకరికి చొప్పున పాస్‌ ఇస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.  

‘స్పందన’ వెబ్‌సైట్‌లో నమోదు చేయండి: కృష్ణబాబు

రాబోయే రోజుల్లో కరోనా నిబంధనలు మరింత సడలించే అవకాశాలున్నాయని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. వలస కార్మికులు spandana.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి రావాలనుకునే వలసకూలీలు వెబ్‌సైట్‌, మెయిల్‌ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రాంతం, వెళ్లాలనుకునే ప్రాంతం వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలియజేయాలని కృష్ణబాబు సూచించారు. శ్రామిక్‌ రైళ్లలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన జాబితా ప్రకారమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి మహారాష్ట్రలోని బలార్షకు రెండు శ్రామిక్‌ రైళ్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి వచ్చేవారు కూడా ఒక క్రమపద్ధతిలో రాకపోతే వారికి సదుపాయాలు చేయడం కష్టమవుతుందని కృష్ణబాబు వివరించారు. 

ఇదీ చదవండి..

శ్రామిక్‌ రైళ్లకు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాల్సిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని