ఏపీలో మరోసారి స్థానిక ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల  మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు..

Published : 07 May 2020 02:05 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల  మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జస్టిస్ వి. కనగరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని తెలియజేసింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్  ప్రకటించారు. 6 వారాల అనంతరం పరిస్ధితిని సమీక్షించి ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గడువు గత నెల 26తో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్ర ఎస్‌ఈసీగా బాధ్యతలు చెపట్టిన జస్టిస్ వి. కనగరాజ్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలపై వైకాపా జెండా రంగులతో పోలిన రంగులను మార్చాలని హైకోర్టు అప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పులో స్పష్టంగా పేర్కొంది. నిర్ణీత గడువులోగా ప్రభుత్వ కార్యాలయాలపై రంగులను తొలగించకపోవడం.. లాక్‌డౌన్ ఎప్పటికి ముగుస్తుందనే విషయంపైనా స్పష్టత లేకపోవడంతో ఎన్నికల నిర్వహణను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని