పసుపు పండుగ మహానాడు ప్రారంభం

పసుపు పండుగ మహానాడు ప్రారంభమైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Updated : 27 May 2020 12:23 IST

అమరావతి: తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే ‘మహానాడు’ ప్రారంభమైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములయ్యారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ... ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏటా జరిగే ఈ వేడుకను కరోనా కారణంగా ఈసారి డిజిటల్‌ మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు.

ప్రధాన సమస్యలపై చర్చ: యనమల
రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ‘మహానాడు’ చర్చిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అన్ని రంగాలను వైకాపా భ్రష్టు పట్టించిందన్న ఆయన.. ఏడాది పాలనలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. ఏ రంగం అభివృద్ధిపైనా దృష్టిసారించక పోగా  .. ఉన్న పథకాలకు కోత పెట్టారని మండిపడ్డారు.  నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా జగన్‌ వ్యవహారం ఉందితప్ప రాజ్యాంగ పరంగా ఎన్నికైన ప్రభుత్వంలా లేదని యనమల విమర్శించారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలపైనా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపై ఎదురుదాడి చేసే ఘటనలు ఒక్క జగన్‌ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. న్యాయ వ్యవస్థను సైతం అవమానపరచటం ఈ ప్రభుత్వానికే చెల్లిందని యనమల ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని