‘ప్రజలకు ఏం కావాలో భాజపాకు తెలుసు’

అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Updated : 27 Jun 2020 02:23 IST

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

అమరావతి: అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీలో ఆమె మాట్లాడారు. అంత్యోదయ అనే మాటకు మోదీ ప్రభుత్వం అసలైన అర్థం చెబుతోందన్నారు.  పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుకు ఏడాదికి రూ. ఆరు వేలు ఇస్తున్నామని చెప్పారు. పది కోట్ల మంది రైతులకు రూ.72 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో భాజపాకు తెలుసనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. 

‘‘ఏపీ ప్రజలకు మోదీ అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నారు. కొవిడ్‌ ఫైట్‌ కింద ఏపీకి రూ.8,025 కోట్లు ఇచ్చాం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ సంస్థల పనుల్లో ఒప్పందాలు ఉల్లంఘించకూడదు. ఇష్టం వచ్చినట్లు చేయడం వల్ల ప్రాజెక్టుల్లో అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నాను. కేంద్రం ఒక స్థాయిలో రూ.2.7కి విద్యుత్తు ఇస్తోంది. ఏపీలో రూ. తొమ్మిది ఛార్జి చేయడం విని ఆశ్చర్యపోయా. రూ. తొమ్మిది ఇచ్చి పరిశ్రమల నిర్వహణ సాధ్యమేనా ఆలోచించాలి’’ అని నిర్మల అన్నారు.

‘‘ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక నిధులు మంజూరు చేశారు. స్థూల దేశీయ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ తొమ్మిదో ర్యాంకులో ఉంది. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలది ప్రముఖ స్థానం. ఏపీలోని 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.936 కోట్లు వేశాం. ఏపీలోని 546 మత్స్యాకార గ్రామాల్లో 349 పిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఏపీలోని ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించాం. ఎంత ఉపయోగించుకుంటారో రాష్ట్రానికే అవకాశం ఇచ్చాం. మత్స్య సంపద యోజన కింద ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో ఏపీది మూడో ర్యాంకు. ’’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు