భేషజాలకు పోకుండా చర్యలు తీసుకోవాలి
‘‘రాజధాని నగరం ఇప్పుడు కల్లోల పరిస్థితిలో ఉంది. ఎప్పుడు, ఎక్కడ కరోనా వైరస్ విజృంభిస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు’’
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్: ‘‘రాజధాని నగరం ఇప్పుడు కల్లోల పరిస్థితిలో ఉంది. ఎప్పుడు, ఎక్కడ కరోనా వైరస్ విజృంభిస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి క్షణాల్లో రోగికి ఆక్సిజన్ దొరకక ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడుతున్న విషయాన్ని రికార్డు చేసి పంపుతున్న దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఆరోగ్యశాఖ మంత్రి మానవత్వంతో ఆలోచించడం లేదు. తిరిగి ‘మరణించిన వాళ్లు... వీడియోలు రికార్డు చేసి పంపడం న్యాయమా’ అని అడుగుతున్నారు. మానవత్వం ఉన్న వారెవరు ఇలా ప్రశ్నించరు. ఒక సామాన్యుడు కరోనా సోకితే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భేషజాలకు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని భట్టి విక్రమార్క కోరారు.
‘‘ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మద్యం దుకాణాలను తెరవడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయిరోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా... కరోనా రోగులు చనిపోయే ప్రమాదంలో ఉన్నా ప్రాధాన్యత ఇవ్వకుండా సీఎం కేసీఆర్ హరితహారం అంటూ సమీక్షలు పెడుతున్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి... దాని ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందించాలి’’ అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.