సచిన్‌ పైలట్‌ మళ్లీ డుమ్మా!

ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం మరోసారి సమావేశమయ్యింది. ప్రస్తుతం గహ్లోత్‌ వర్గం బస చేస్తున్న జైపుర్‌లోని...........

Updated : 14 Jul 2020 13:57 IST

జైపుర్‌: రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేడు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం రెండోసారి సమావేశమయ్యింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి గహ్లోత్‌ వర్గం బస చేస్తున్న జైపుర్‌లోని ఫెయిర్‌మోంట్‌ హాటల్‌లో ఈ భేటీ ప్రారంభమయింది. ఊహించినట్లే సచిన్‌ పైలట్‌ మరోసారి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. 

రాహుల్, ప్రియాంక మాట్లాడినా..

సమావేశానికి ముందు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, కె.సి.వేణుగోపాల్‌ పలుసార్లు సచిన్‌ పైలట్‌తో మాట్లాడినట్లు పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తెలిపారు. అయినా, ఆయన సీఎల్పీ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తిరిగి రావడానికి సమయం ఇస్తున్నామన్న సంకేతం పైలట్‌కు పంపడానికే పదే పదే సీఎల్పీ భేటీ నిర్వహిస్తున్నారన్నారు. పార్టీ అధినాయకత్వం ఇప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భేటీ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

కష్టపడేవారిని విస్మరిస్తున్నారు..

ఐదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడ్డవారిని సీఎం గహ్లోత్‌ విస్మరించారని పైలట్‌ వర్గంలోని ఎమ్మెల్యే మురళీలాల్ మీనా ఆరోపించారు. గహ్లోత్‌ చుట్టూ చేరిన కొంతమంది ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. వారి మాటలు విని ఎన్నికల హామీల్ని కూడా సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించాలంటే ప్రక్షాళన తప్పదని హతవు పలికారు. 

బలపరీక్షకు డిమాండ్‌ చేయడం లేదు..

తాజా పరిణామాలపై భాజపా రాజస్థాన్‌ శాఖ అధ్యక్షుడు సతీష్‌ పునియా స్పందించారు. తాము ప్రస్తుతానికి శాసనసభలో బలపరీక్షను డిమాండ్‌ చేయదలచుకోలేని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉన్నామని కాంగ్రెస్‌ చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయన్నది సుస్పష్టం అన్నారు. పార్టీలో అవమానాలు భరించలేకే సచిన్‌ పైలట్‌ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారన్నారని అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు