Mamata: యూపీఏ పగ్గాలు మమతకు ఇవ్వాలి

UPA Leadership: పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ

Updated : 06 May 2021 12:10 IST

భాజపాయేతర ప్రాంతీయ పార్టీల డిమాండ్‌ 
కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతల నుంచీ మద్దతు 

ఈనాడు, దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. భాజపాయేతర పార్టీల్లో ఆమె హవా పెరిగింది. ఆమెను యూపీఏ కూటమి ఛైర్‌పర్సన్‌గా గానీ కన్వీనర్‌గా గానీ ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పేలవ ప్రదర్శన వల్లే లౌకిక పార్టీలు ఓటమిపాలవుతున్నాయని భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు కొంతకాలంగా విమర్శలు చేస్తున్నాయి. గత ఏడాది నవంబరులో బిహార్‌ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి.. ఎన్‌డీఏ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సీట్ల సర్దుబాటు సమయంలో బలానికి మించి స్థానాలను కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడమే ఇందుకు కారణమని ఆర్జేడీ అప్పట్లో ఆరోపించింది. ‘‘70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. 19 చోట్ల మాత్రమే గెలిచింది. 51 స్థానాల్లో ఆ పార్టీ ఓటమి.. ఎన్‌డీఏ విజయానికి దోహదపడింది’’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ పాత్ర పరిమితం కావాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా చెబుతున్నారు. మార్చి 16న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.సి.చాకోను తమ పార్టీలో చేర్చుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తృతీయ ఫ్రంట్‌ కోసం భాజపాయేతర పార్టీల్లో సెంటిమెంట్‌ పెరుగుతోందన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీలు అధికార కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తృతీయ కూటమి ఆలోచన వల్ల జాతీయ రాజకీయాల్లో తన పాత్ర మరింత దిగజారుతుందని భావించిన కాంగ్రెస్‌.. ఆ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తోంది.

మారిన వైఖరి..

అయితే ఈ నెల 2న పశ్చిమ బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు వచ్చింది. బెంగాల్లో కొద్దోగొప్పో మిగిలిన కాంగ్రెస్‌ ఓట్లను ఈ ఎన్నికల్లో తృణమూల్‌ ఊడ్చేసింది. జనం నాడిని పట్టుకోవడంలో రాహుల్‌ గాంధీ తరచూ విఫలమవుతున్నారని సోనియా గాంధీ కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోనియా-రాహుల్‌ పనితీరుపై ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్‌లోని ఒక బృందం తీరు ఇప్పుడు మారింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఫలితాలు పేలవంగా ఉన్నప్పటికీ రాహుల్‌పై తమ వ్యతిరేకతను వారు సడలించుకున్నారు. ‘‘కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ తిరిగి ఎన్నిక కావాలని సోనియా ఇప్పటికీ భావిస్తుంటే.. ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్‌ పదవిని వదులుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పదవిని కాంగ్రెసేతర పార్టీ నేతకు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఆ హోదాను వదులుకోవడం సోనియాకు ఇష్టం లేకపోతే కనీసం సదరు నేతను కూటమి కన్వీనర్‌గా ఎంపిక చేయాలని అడుగుతున్నారు’’ అని పార్టీ నేత ఒకరు చెప్పారు. యూపీఏ పగ్గాలు శరద్‌ పవార్‌ చేపట్టాలని గతంలో భాజపాయేతర పార్టీలు కోరుకునేవి. అయితే కాంగ్రెస్‌కు అది ఇష్టంలేదు. అయితే బెంగాల్‌లో తాజా విజయం తర్వాత మమత హవా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఛైర్‌పర్సన్‌గా కానీ కన్వీనర్‌ హోదాలో కానీ యూపీఏను నడిపించేందుకు అత్యంత సమర్థురాలైన నేతగా గుర్తింపు పొందారు. భాజపాయేతర పార్టీలైన డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లతో మమతకు మంచి సంబంధాలు ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ నేత శరద్‌ పవార్‌ ప్రయత్నిస్తారని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. విపక్షాల ఐక్యత చాలా అవసరమని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని