పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత

పలాస శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు.

Updated : 19 Aug 2022 10:22 IST

ఇళ్లు తొలగిస్తామంటూ వచ్చిన అధికారులు

 తెదేపా, వైకాపా నాయకుల వాగ్వాదం

పొక్లెయిన్‌ ముందు బైఠాయించిన బాధితులు

పలాస, న్యూస్‌టుడే: పలాస శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నాం.. ఇప్పుడు కూలగొడతామంటే మేమంతా ఎక్కడికి వెళ్లాలి’ అంటూ అడ్డు తగిలారు.  
పొక్లెయిన్‌ రాకతో: అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో తెదేపా, వైకాపా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్‌ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

ఈ తరహా రాజకీయాలు జిల్లాలో ఎప్పుడూ లేవు: ఎమ్మెల్యే అశోక్‌

పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఎమ్మెల్యే అశోక్‌ విమర్శించారు. అనంతరం పోలీసులు పొక్లెయిన్‌ను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా రాజకీయాలు ఈ జిల్లాలో ఎప్పుడూ లేవన్నారు. ప్రజల్ని బాధపెట్టి ఏం సాధిస్తారని నిలదీశారు. వైకాపా నేతలే సవాలు విసిరారని..  అధికారంలో ఉన్నది వారే కాబట్టి దమ్ముంటే విచారణ జరిపించి తప్పును నిరూపించాలన్నారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే అశోక్‌ను మందస పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బలవంతంగా పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. 


కాళ్లు పట్టుకుని..: ఓ మహిళ పలాస తహసీల్దార్‌ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. చెరువు విస్తీర్ణం పరిశీలించాలని తహసీల్దార్‌కు విన్నవించటంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతలో వైకాపా నాయకులు విషయాన్ని మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన కొంతమందిపై ఫిర్యాదు వచ్చిందని పేర్కొనటంతో, వారిపై చర్యలు తీసుకుని మిగిలిన పేదలందరి ఇళ్లు విడిచిపెట్టాలని దుర్గ అనే మహిళ ఫోన్‌లో మంత్రికి విన్నవించారు. తాను కార్యాలయంలో ఉంటానని మీరంతా వస్తే పట్టాలు ఇస్తామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకే...
చెరువు గర్భంలో నిర్మాణాలపై హైకోర్టు నుంచి వివరాలు కోరిన మీదట పరిశీలించాం. శ్రీనివాసనగర్‌ ప్రాంతంలో 52 ఇళ్లు అక్రమంగా నిర్మించారు. వాటిని తొలగించేందుకు రావటంతో స్థానికులంతా తమ ఆవేదన తెలపటంతో లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే హైకోర్టుకు సమర్పిస్తామని వారికి వివరించాం.- ఎల్‌.మధుసూదన్‌రావు, తహసీల్దార్‌, పలాస


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని