తెదేపాపై ప్రేమ ఉంటే ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయండి: చంద్రబాబుకు మంత్రి ఎర్రబెల్లి సూచన

చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Updated : 23 Dec 2022 06:53 IST

ఈనాడు, వరంగల్‌: చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని ఖమ్మం సభలో చంద్రబాబు పిలుపు ఇచ్చారని ఓ విలేకరి ప్రస్తావించగా మంత్రి స్పందించారు. ‘‘అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు. ఎన్టీఆర్‌ది. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్‌ ఏపీలో సీఎం కావాలనుకుంటున్నారు. కానీ ప్రజలు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నారు. చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఎన్టీఆర్‌ను అక్కడ ముఖ్యమంత్రిని చేయాలి’’ అని అన్నారు.

చంద్రబాబు దిగిపోయేనాటికి హైటెక్‌సిటీ దగ్గర మంచి నీళ్లకూ దిక్కులేదు: మంత్రి సబితారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: చంద్రబాబు హైటెక్‌సిటీలో ఒక భవనం కట్టి అంతా తానే చేశానని కోతలు కోస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆయన సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్‌సిటీ దగ్గర మంచి నీళ్లకూ దిక్కులేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారానే రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తోందని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు భాజపాకు దగ్గర కావాలనే ఇప్పుడు మళ్లీ తెలంగాణ అంటున్నారు. మోదీ దర్శకత్వంలో తిరుగుతున్నారు.  కరోనా సమయంలో తెలంగాణలోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదు’’ అని అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌లలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి వెంట ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని