బ్రిటిష్‌వాళ్ల కన్నా ఘోరంగా జగన్‌ పాలన

సీఎం జగన్‌ బ్రిటిష్‌ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Published : 05 Jan 2023 06:32 IST

సభలు, సమావేశాలను నిషేధించే చట్టం రాష్ట్రానికి వర్తించదు
కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం
రోడ్‌షోకు అనుమతించేది లేదన్న డీఎస్పీతో వాగ్వాదం
పెద్దూరులో రహదారిపైనే ప్రసంగం

ఈనాడు, చిత్తూరు: సీఎం జగన్‌ బ్రిటిష్‌ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నడిరోడ్డుపైనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో స్పష్టతివ్వాలని పోలీసులను ప్రశ్నించారు.

సీఎంకు నిబంధన వర్తించదా?

‘ఇది నా సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత నెలలోనే కుప్పం నియోజకవర్గానికి వస్తానని డీజీపీకి సమాచారమిచ్చా. ఈ నెల 2న ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం నేను ఎక్కడా రోడ్‌షో పెట్టకూడదంటున్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీ రహదారుల్లో రోడ్‌షోలు పెట్టకూడదని ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చింది. సీఎం దయాదాక్షిణ్యాలతో సమావేశాలు పెట్టుకోవాలని పోలీసులు నిబంధన తెచ్చారు. అదే సీఎం నిన్న సమావేశం పెట్టినప్పుడు స్కూళ్లకు సెలవిచ్చారు. ఆర్టీసీ, ప్రైవేటు, స్కూలు బస్సులన్నీ తీసుకున్నారు. డ్వాక్రా మహిళలు రాకుంటే పింఛను, రేషన్‌ తొలగిస్తామని ఇబ్బందులు పెట్టారు. కానీ తెదేపా కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్‌ పని అయిపోయిందని ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.  

అమల్లో లేని చట్టం

1861వ చట్టం ప్రకారం పోలీస్‌ యాక్ట్‌ 30 తీసుకొచ్చామని చెబుతున్నారు. దానిపై ఉత్తర్వులిచ్చారు. జీవో 1ని ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు? 1861 చట్టప్రకారం అయితే అందులోని 46వ నిబంధన ప్రకారం మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఇది వర్తించదు. ఇప్పటికే ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని స్వీకరించాలంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఈ చట్టాన్ని ఎప్పుడు స్వీకరించారో చెప్పాలి. ఒకవేళ ఇప్పటికే చట్టం అమల్లో ఉంటే కొత్తగా జీవో ఎందుకు? చట్టం అమల్లో లేకుంటే జీవో దేని ప్రకారం తీసుకొచ్చారు’ చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.  

2న జీవో.. 1 నుంచి అమలా?: ‘రోడ్లపై సభలు, సమావేశాలు వద్దని 2న ప్రభుత్వం జీవో ఇచ్చింది. 1 నుంచి యాక్ట్‌ 30 అమల్లో ఉందని పలమనేరు డీఎస్పీ నోటీసిచ్చారు. 2వ తేదీన జీవో ఇస్తే 1 నుంచే అమలు చేశారంటే ఈ డీజీపీ ఎంత సమర్థుడో అర్థమవుతోంది’ అని మండిపడ్డారు.

ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా?

‘జగన్‌మోహన్‌రెడ్డీ.. ఆంధ్రప్రదేశ్‌లో చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా? కుప్పం నా నియోజకవర్గం. మీలాంటి వాళ్లు వేల జన్మలు ఎత్తినా కుప్పం ప్రజల గుండెల్లో ఉండేది తెదేపానే. సమావేశాలు పెట్టుకోవడానికి వీల్లేదు. మైకులకు, రోడ్‌షోలకు అనుమతివ్వం..  గ్రామాలకు రాకూడదు.. ఎవరినీ కలవకూడదని అంటున్నారు.. అదే రాసివ్వాలని డీఎస్పీని కోరాను. ఆయన రాసిచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాను. అయ్యా, డీఎస్పీ.. నేను జగన్‌మోహన్‌రెడ్డిలా చట్ట వ్యతిరేకంగా వెళ్లను. హత్యా, గూండా రాజకీయాలు చేయను. హుందాగా, ప్రజల కోసం రాజకీయం చేస్తాను. మీరు నన్ను ప్రజలను కలవనివ్వకుండా చేయాలని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నా దగ్గర సాగదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, ఒక సైకో ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నా. కుప్పం నియోజకవర్గాన్ని దోచుకుంటూ రౌడీలను ప్రోత్సహించారు’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.


కాలినడకనే గ్రామాల్లో తిరిగిన చంద్రబాబు

ప్రచార రథాన్ని తెప్పించడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో చంద్రబాబు పెద్దూరు గ్రామంలో సుమారు 20 నిమిషాలపాటు కాలినడకన తిరిగారు. ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మిగిలిన పల్లెలకూ కారులో వెళ్లారు. షెడ్యూల్‌లోని బెండనకుప్పం, గొల్లపల్లె క్రాస్‌, శివకురుబూరు, తదితర గ్రామాల్లోని వీధుల్లో కాలి నడకనే పర్యటించారు.


చంద్రబాబు X డీఎస్పీ

చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో డీఎస్పీ అక్కడికి రాగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చంద్రబాబు: అనుమతి అడిగితే తిరస్కరించామన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చా. నా ప్రజలతో నేను మైకులో మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎక్కడ అనుమతి ఇస్తారు? ఎందుకు ఇవ్వరో స్పష్టంగా చెప్పాలి. నా కార్యక్రమాలకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని నేరుగా అడుగుతున్నా. నా నియోజకవర్గానికి రాకుండా నేను పారిపోవాలా?
డీఎస్పీ: మేం వెళ్లమని చెప్పలేదు.

చంద్రబాబు: ఐదు కోట్ల ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. నాకు మైకు ఎందుకివ్వరు? నా రోడ్‌షోకు ఎందుకు అనుమతివ్వరు? నా ప్రజలతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు. నా గత పర్యటనలో ఇదే నియోజకవర్గంలో 74 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. పది మందిని అరెస్టు చేసి, నెల రోజులు జైల్లో పెట్టారు. నన్నూ జైల్లో పెట్టండి. అందరికీ బేడీలు వేయండి. నిన్ననే జగన్‌ వెళ్లాడు.. ఆయన రోడ్డుపై వెళ్లొచ్చా? వైకాపాకు ఒక చట్టం, నాకు ఒక చట్టమా? మీ డీజీపీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలి.  
డీఎస్పీ: లిఖితపూర్వకంగా మీరడిగితే ఇస్తాం సార్‌.

చంద్రబాబు: నేను మౌఖికంగా అడుగుతున్నా. నియోజకవర్గంలో తిరగాలని అడుగుతున్నా.
డీఎస్పీ: నియోజకవర్గంలో తిరిగేందుకు అభ్యంతరం లేదు సార్‌.

చంద్రబాబు: సమావేశం పెట్టాలని అడుగుతున్నా.
డీఎస్పీ: సమావేశం గ్రామాల్లో పెట్టుకునేందుకు అభ్యంతరం లేదు. రోడ్డుపై అయితేనే అభ్యంతరం.

చంద్రబాబు: మైకు ఎందుకు ఇవ్వలేదు?
డీఎస్పీ: మైకు ఎక్కడ అనేది చెప్పాలని అడిగాం.

చంద్రబాబు: ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడికి వెళ్తాం. ప్రైవేటు స్థలాల్లో ఎక్కడ పెట్టుకోవాలి. నా వాహనం ఇవ్వరా?
డీఎస్పీ: ఇస్తాం సార్‌. ఎక్కడికి పోతుంది?

చంద్రబాబు: నేను వాహనం ఎక్కి ప్రజలనుద్దేశించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ నుంచి మాట్లాడాలి?
డీఎస్పీ: రోడ్డు మీద కాకుండా పల్లెల్లో మాట్లాడవచ్చు.

చంద్రబాబు: నా వాహనం తీసుకెళ్లారు. లోపల పెట్టమంటే అక్కడే సమావేశం పెడతాను. ఇవ్వరా?
డీఎస్పీ: వాహనాలు ఇస్తాం.. లోపల పల్లెల్లో మైక్‌ అనుమతి ఉంది. వాహనం కాకుండా మైక్‌లో మాట్లాడవచ్చు.

చంద్రబాబు: వాహనంపై మాట్లాడేందుకు లేదా?
డీఎస్పీ: వాహనంపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీ రహదారులపై మాట్లాడకూడదు.

చంద్రబాబు: గ్రామాల్లో పంచాయతీ రోడ్డు కాకుంటే ఏముంది?  
డీఎస్పీ: పల్లెల్లో అభ్యంతరం చెప్పడం లేదు. జీవో ప్రకారం వెళ్తే చాలు.

చంద్రబాబు:మీరు నా వాహనం ఇచ్చే వరకు పల్లెలకు వెళ్లి తిరుగుతా అంటూ ఆయన ముందుకు కదిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని