Pawan Kalyan: పొత్తులతోనే పోటీకి

వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తామని.. అయితే అది గౌరవప్రదంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలని, అందుకు తగ్గ వ్యూహం ఉండాలని ఉద్ఘాటించారు.

Updated : 13 Jan 2023 06:54 IST

అదీ గౌరవప్రదంగా ఉంటేనే..
నియంతను ఎదుర్కోవడానికి వ్యూహం ఉండాలి
అత్తతో గొడవపడితే మాట్లాడటం మానేస్తామా.. సర్దుకుపోవాలి
రణస్థలం యువశక్తి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు
రాష్ట్ర భవిష్యత్తుపైనే తెదేపా అధినేత చంద్రబాబుతో చర్చించానని వెల్లడి
ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జనసేనాని


వారాహితో వస్తాం.. ఎవడాపుతాడో చూస్తాం

వైకాపా సైకో పార్టీ.. జగన్‌ అసాంఘిక శక్తి.. మా ప్రభుత్వం రాకపోతే చంపేస్తాం, మేమే  పాలించాలి, ఎవర్నీ రానివ్వం అని వైకాపా వాళ్లు బెదిరిస్తున్నారు. వాటికి భయపడేవాణ్ని కాదు. వారాహితో వస్తాం.. ఎవడాపుతాడో చూస్తాం.

పవన్‌ కల్యాణ్‌


ఈనాడు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అమరావతి- న్యూస్‌టుడే బృందం: వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తామని.. అయితే అది గౌరవప్రదంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలని, అందుకు తగ్గ వ్యూహం ఉండాలని ఉద్ఘాటించారు. బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఆ నమ్మకం మీరిస్తారా అని పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో ఆయన వైకాపా అరాచకాలపై విరుచుకుపడ్డారు. ‘ప్రజలందరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోవాలంటే.. మనకు పడని శత్రువులతోనూ కలవాల్సిందే’ అని పేర్కొన్నారు.

బేరాలు కుదిరాయంటూ పిచ్చికూతలు..

‘ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడితే బేరాలు కుదిరాయని పిచ్చికూతలు కూస్తున్నారు. నేను ఏటా రూ.25 కోట్ల పన్ను కట్టే సత్తా ఉన్నవాణ్ని.. విశాఖపట్నంలో నన్ను నిర్బంధించినప్పుడు ఆయన వచ్చి సంఘీభావం తెలిపారు. నేనూ అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశాను. అయితే సీట్ల గురించి మాట్లాడలేదు’ అని వివరించారు. ‘గత ఎన్నికల్లో జనసేనకు 175 నియోజకవర్గాల్లో సరాసరి 6.9% ఓట్లు వచ్చాయి. అవన్నీ ఒక్కచోటే వచ్చి ఉంటే శాసనసభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. ఓటు పలచబడింది. ఓట్లు చీలడంతో 53 నియోజకవర్గంలో వైకాపా గెలిచింది’ అని పవన్‌ చెప్పారు.

రాష్ట్ర భవిష్యత్తుపైనే మాట్లాడా..

చంద్రబాబుతో సమావేశంలో.. క్షీణించిన శాంతిభద్రతలు, రాష్ట్ర భవిష్యత్తుపైనే ఎక్కువసేపు చర్చించామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘రెండున్నర గంటలపాటు ఏం మాట్లాడారని అంటున్నారు.. మొదటి పది నిమిషాలు మీరు బాగున్నారా అనే కుశల ప్రశ్నలతో సరిపోయింది. తర్వాత పోలవరం నిర్మాణంలో జాప్యం, జలవనరులశాఖ మంత్రి సంబరాల రాంబాబు పనితీరుపై 23 నిమిషాలు మాట్లాడాం. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని 15వ స్థానంలో నిలిపిన ఐటీ శాఖ మంత్రిపై 18 నిమిషాలు చర్చించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఏం చేయాలనే విషయమై 38 నిమిషాలు మాట్లాడాం. తర్వాత మరోసారి టీ తాగాం.. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనే అంశంపై చర్చించాం. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా’ అని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తుంటే తాను గొంతెత్తేవాణ్ని కాదు, బాగా పాలిస్తుంటే చప్పట్లు కొడతాం.. బాధిస్తుంటే ఎదురుతిరుగుతామని స్పష్టం చేశారు.

ఇంకేం మార్గాలున్నాయి మరి..

‘గతంలో తెలుగుదేశం పార్టీని తిట్టావు కదా అంటున్నారు. మరేం మార్గాలున్నాయి? ఇంట్లో అత్తతోనో, ఎదురింటివారితోనో గొడవ పడితే మాట్లాడటం మానేస్తామా.. సర్దుకుపోవాలి. తప్పదు’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. వారాహితో వస్తాం.. ఎవడాపుతాడో చూస్తాం అంటూ వైకాపా నేతలకు సవాల్‌ విసిరారు. మా ప్రభుత్వం రాకపోతే చంపేస్తాం, మేమే పాలించాలి, ఎవర్నీ రానివ్వం అని వైకాపా వాళ్లు బెదిరిస్తున్నారన్నారు. అలాంటి వెధవలకు భయపడేవాణ్ని కాదని స్పష్టం చేశారు. ‘వైకాపా సైకో పార్టీ.. జగన్‌ అసాంఘిక శక్తి.. ఆయన అసందర్భంగా నవ్వుతారు. అది సైకో లక్షణం’ అని దుయ్యబట్టారు.

మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్‌

జగన్‌ మూడుముక్కల ముఖ్యమంత్రి.. ఆయనకో ఢంకా పలాసు సలహాదారు అని పవన్‌ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి గ్యాంబ్లింగ్‌ పిచ్చి ఉందట, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ఆడతారని ఈ మధ్యే తెలిసిందని పేర్కొన్నారు. ‘సన్నాసి, చేతగాని మూడు ముక్కల ప్రభుత్వం ఇది. జైలుకెళ్లి 6093 ఖైదీ నంబరుపై ఉన్నవారు నా గురించి మాట్లాడితే ఎలా! డీజీపీ కూడా సెల్యూట్‌ కొట్టేది 6093 ఖైదీ నంబరుకే.. ముఖ్యమంత్రికి కాదు’ అని విమర్శించారు. ‘ఏమైనా అంటే దత్తపుత్రుడు అంటారు. జగన్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డినే ఎదుర్కొన్నా. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ను పంచెలూడదీసి కొట్టమని చెప్పా. తర్వాత వారి మనుషులు నాపై దాడులు చేశారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు.. నేను విడాకులిచ్చే పెళ్లి చేసుకున్నా’ అని అన్నారు. ప్యాకేజీ అన్న వాళ్లకు జనసైనికుడి, వీరమహిళల చెప్పుతో కొడతానని ఆగ్రహం వెలిబుచ్చారు. వైకాపా నేతలు అన్ని పదవులు ఒక కులానికే ఇస్తున్నారు.. అది సరైందేనా అని నిలదీశారు.

ఉత్తరాంధ్రను అప్పడంలా మింగేస్తారు

ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని వైకాపా నాయకులు కోరడంపై పవన్‌ ధ్వజమెత్తారు. ‘ప్రతి నాయకుడు తమ జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా చేసేయండి.. రాష్ట్రాన్ని 26 రాష్ట్రాలుగా విభజించండి. మీరు, మీ కుటుంబసభ్యులే పాలించండి. ప్రజల్ని బానిసలుగా చేసుకోండి’ అని విరుచుకుపడ్డారు. ‘విభజన సమయంలో వీరంతా ఏం చేస్తున్నారు.. ఎందుకు అడగలేదు? పదవులు లేకుంటే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? అలా చేస్తామంటే మిమ్మల్నే ముక్కలుగా చేస్తాం’ అని హెచ్చరించారు. ‘విశాఖపట్నంలో 1,281 ఎకరాల భూమి, ఆస్తుల్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చినప్పుడు ఉత్తరాంధ్రపై వీరి ప్రేమ ఏమైంది? సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్నే కాజేసిన మహానుభావులు ఉత్తరాంధ్రను కాపాడతారా? అప్పడంలా మింగేయరూ’ అని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికలు కీలకమైనవి

రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమైనవని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటికీ సినిమాలు చేస్తే ఏడాదికి రూ.250 కోట్లు సంపాదిస్తా. రోజుకు రూ.కోటి వదులుకుని కోట్ల మంది ప్రజల కోసం వస్తున్నా. మీరు మమ్మల్ని నమ్మాలి. మీ కోసం రోడ్లపైకి వస్తా. మీ ఒంటిపై దెబ్బ పడితే అది నాపై పడినట్లే’ అని ప్రజలనుద్దేశించి చెప్పారు. ‘మీరు నన్ను వదిలేస్తే, నా కోసం నిలబడకపోతే ఏం చేయగలను? ఏ కుటుంబం కోసమైతే నేను నిలబడ్డానో వారే మా కులం, గోత్రం అంటూ ఓటేయకపోతే ఏం చేయగలను’ అని ప్రశ్నించారు. ‘పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అని మీరు చెప్పాలి. నేను కోరుకుంటే జరగదు. మీరు అధికారం ఇస్తే సేవకుడిలా పనిచేస్తా. ఇవ్వకపోతే ఊడిగం చేస్తా. కానీ ఇక్కడే నిలబడతా. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. దానికోసం అడ్డదారులు తొక్కడం ఇష్టం లేకే సినిమాలు చేస్తున్నా. సొంత డబ్బునే వదిలేశా. మీ డబ్బును ఎంత బాగా పరిరక్షిస్తానో ఆలోచించండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ఈసారి మారకపోతే అయిదేళ్ల జీవితం ఎగిరిపోయినట్లే. అల్లూరి స్ఫూర్తితో గొంతెత్తండి. లేదంటే దాన్ని నొక్కేస్తారు’ అని హెచ్చరించారు. ‘గత ఎన్నికల్లో రాజాం సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మార్పు వస్తుందని కలగన్నా. ఓటేసేటప్పుడు వదిలేశారు. అయినా బాధపడలేదు. రెండుచోట్ల ఓడిపోయానని కించపరిచినా యుద్ధం తాలూకు గాయంగానే తీసుకున్నా’ అని చెప్పారు.

పథకాలను తీసేయం.. మెరుగ్గా అమలు చేస్తాం

జనసేన అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలను తొలగించబోమని, మరింత మెరుగ్గా అమలు చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ‘అమ్మఒడి ద్వారా రోజుకు రూ.35, ఆటో సోదరులకు వాహనమిత్ర ద్వారా రోజుకు రూ.27, వైఎస్సార్‌ చేయూత కింద మహిళలకు రూ.51, నేతన్న నేస్తం కింద రూ.65 చొప్పున ఇస్తున్నారు. సగటున రూ.24 నుంచి రూ.50 ఇస్తున్నారు. వాటికి అమ్ముడుపోవద్దు’ అని కోరారు. అభివృద్ధి లేకుండా, పరిశ్రమలు పెట్టకుండా సంక్షేమం ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు.

దోషులకు శిక్షపడేలా చేస్తా

‘నువ్వులరేవుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నగేశ్‌ 2021 జనవరి 27న చనిపోతే.. ఇప్పటికీ  పోస్టుమార్టం నివేదిక ఇవ్వలేదు. ఏంటమ్మా రోజూ వస్తావు, మీకేమైనా బాకీ ఉన్నామా అని వైకాపా మంత్రి వెటకారంగా మాట్లాడుతున్నారంట. మూడు బస్తాల బియ్యం ఇస్తామని అన్నారంట.. బిడ్డ చనిపోయిన తల్లితో ఇలా మాట్లాడతారా? ఏం చేయాలి వీరిని? ఇంకోసారి ఇలాంటివారిని గెలిపిస్తారా’ అని పవన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దోషులకు శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ’సరైన రాజు లేకుంటే సగం రాజ్యం పోతుందట.. సలహాలిచ్చేవారు సజ్జల అయితే సంపూర్తిగా నాశనమవుతుంది’ అని ఎద్దేవా చేశారు.

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాల్సిందే

రాష్ట్రంలో పోలీసుశాఖతో ఊడిగం చేయిస్తున్న ప్రభుత్వం.. వారికి టీఏ, డీఏ, సరెండర్‌ లీవుల డబ్బూ ఇవ్వడం లేదని, ఒక్కో పోలీసుకు రూ.1.40 లక్షలు రావాల్సి ఉందని జనసేన అధినేత పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి తెలంగాణలో మాదిరిగా అయిదేళ్లకు పెంచాలని డిమాండు చేశారు.

ఛీ.. డైమండ్‌ రాణి కూడా..!

డైమండ్‌ రాణి రోజా కూడా మాట్లాడుతున్నారని, చివరకు ఆమెతోనూ తిట్టించుకుంటున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘చివరకు నువ్వు కూడానా. ఛీ.. నా బతుకు చెడ’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కళింగ వైశ్య మహిళపై సన్నాసి, వెధవ అయిన ఐటీశాఖ మంత్రి హత్యాయత్నం కేసు పెట్టించారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు ఓ వైశ్యుడి త్యాగమే కారణమన్నారు.


కళింగాంధ్ర కాదు.. కలబడే ఆంధ్ర

ఇది కళింగాంధ్ర కాదు, కలబడే ఆంధ్ర.. తిరగబడే ఆంధ్ర.. ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై యువత ఎదురుతిరగాలి. వైకాపా నేతలను నిలదీయాలి.

పవన్‌ కల్యాణ్‌


మేం అధికారంలోకి వస్తే..

* సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులలకు మాటిస్తున్నా. పూర్తిస్థాయి జనసేన ప్రభుత్వం వచ్చినా, మిశ్రమ ప్రభుత్వం ఏర్పడినా పంచాయతీల నిధులను దారి మళ్లించం. ఎప్పటికప్పుడు వచ్చేలా చేస్తాం.

* ఉత్తరాంధ్రలో వలసలు ఆపుతాం. ఆర్థిక రాజధానిగా చేస్తాం. పెట్టుబడులు తెప్పిస్తాం.  

* ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేస్తాం. యూనివర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చేస్తాం.

* అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ ప్రాంతాల్లో పరిశ్రమలను సేఫ్టీ ఆడిట్‌ చేయిస్తాం.

* జీడిమామిడి, కొబ్బరి బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.

* రాష్ట్రంలో రహదారులు నిర్మిస్తాం. ఇసుక మాఫియాలో ప్రమేయమున్న వారికి శిక్ష పడేలా చేస్తాం.

* రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి వచ్చేలా చేస్తాం.

* నాగావళి- వంశధారలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవసరమైన నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తాం.

* మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తాం. జెట్టీలు కట్టిస్తాం. జీవో 217 ఉత్తర్వులను చించేస్తాం.

* యువతకు సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలిస్తాం.

* గత్యంతరం లేక గంజాయి సాగు చేస్తూ ఇబ్బంది పడుతున్న గిరిజన యువతను ఆ ఊబి నుంచి బయటకు తెస్తాం.

* విద్యార్థులకు జాప్యం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం.

* నేను పుట్టిన కులం సహా ఏ ఒక్క కులానికో కాపు కాయను. అన్ని కులాలనూ గౌరవిస్తాం.

* మీ కోసం దెబ్బతిన్న క్షతగాత్రుణ్ని నేను.. ఎన్నికల్లో అధికారమిస్తే శాంతిని, సౌభాగ్యాన్నిస్తా’ అని పవన్‌ పేర్కొన్నారు.


తరలివచ్చిన జనసైన్యం

లావేరు, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభ విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. పవన్‌ కల్యాణ్‌ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని తొలుత ప్రకటించినా... సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. అప్పటి వరకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన    యువకులు మాట్లాడారు. ముందుగా వంద మంది వివిధ అంశాలు, సమస్యలపై మాట్లాడతారని ప్రకటించినా.. సమయాభావంతో తక్కువ మందే మాట్లాడగలిగారు. సభకు సుమారు లక్ష మంది వరకు హాజరై ఉంటారని అంచనా. మహిళలు, యువతులు కూడా భారీ తరలివచ్చారు. ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో ఒకానొక సమయంలో చిన్నపాటి తోపులాట జరిగింది. స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన వీర మహిళలతో బెలూన్లు ఎగురవేసి కార్యక్రమం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించారు. గోదావరి జిల్లాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని