కశ్మీర్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పంజాబ్‌ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్‌ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్‌లీ మోడ్‌ నుంచి రాహుల్‌ యాత్ర ప్రారంభించారు.

Published : 21 Jan 2023 05:21 IST

పాల్గొన్న సంజయ్‌ రౌత్‌
తొలిసారి రెయిన్‌కోట్‌ ధరించిన రాహుల్‌

కథువా: పంజాబ్‌ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్‌ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్‌లీ మోడ్‌ నుంచి రాహుల్‌ యాత్ర ప్రారంభించారు. శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌, పరమ్‌వీర్‌చక్ర అవార్డు గ్రహీత విశ్రాంత కెప్టెన్‌ బానా సింగ్‌లతో పాటు కాంగ్రెస్‌ నాయకులు,  పెద్ద ఎత్తున కార్యకర్తలు రాహుల్‌తో కలిసి నడిచారు. ఇప్పటి వరకూ తెల్ల టీషర్టుతోనే పర్యటించిన రాహుల్‌ శుక్రవారం తొలిసారి రెయిన్‌కోటు ధరించారు. పలుచోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ముందుకు సాగారు. ఓ చోట కొంతమంది భాజపా, పప్పు అని ప్లకార్డులు పట్టుకుని నిలబడగా.. వారిని చూసి రాహుల్‌ నవ్వుకుంటూ అభివాదం చేశారు. ఇదే సమయంలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడానికి సిద్ధమైన ఓ కార్యకర్తను వలంటీర్లు నిలువరించారు. దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, అసలైన సమస్యలపై గొంతెత్తున్న నాయకుడిగా రాహుల్‌ను చూస్తున్నట్లు సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

రాహుల్‌ పాదయాత్రకు సీఆర్పీఎఫ్‌, పోలీసు సిబ్బందితో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. జోడోయాత్రకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని విలేకర్లతో మాట్లాడుతూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా స్పష్టంచేశారు. ఆ విషయంలో ఎలాంటి సమస్యా రాదని తెలిపారు. యాత్రను కశ్మీర్‌ మారుమూల ప్రాంతాల మీదుగా తీసుకెళ్లాలని స్థానిక నాయకత్వం భావిస్తోంది. ఈ విజ్ఞప్తికి ఇప్పటి వరకూ అనుమతి రాలేదని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ఇది సాధ్యం కాకపోతే జాతీయ రహదారిపైనే యాత్ర వెళ్లేలా మరో ప్రణాళిక రూపొందించామన్నారు. అధికారులు దేనికి అనుమతిస్తే దానిని అనుసరిస్తామని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా రూట్‌మ్యాప్‌ను ప్రకటించబోమని వెల్లడించారు. చడ్వాల్‌లో నిలిచిన యాత్ర తిరిగి ఆదివారం ఉదయం హీరానగర్‌ నుంచి ప్రారంభంకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని