25న కడపకు లోకేశ్‌

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి కడపకు బయలుదేరుతారు. అక్కడి నుంచి తిరుమల, కుప్పానికి వెళ్లనున్నారు.

Updated : 24 Jan 2023 20:02 IST

తొలుత హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌కు నివాళి
కడప దర్గా, కేథలిక్‌ చర్చిలో ప్రార్థనలు
26న తిరుమల నుంచి కుప్పానికి పయనం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి కడపకు బయలుదేరుతారు. అక్కడి నుంచి తిరుమల, కుప్పానికి వెళ్లనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్‌ ఘాట్‌ చేరుకుంటారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3.15కు హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 6 గంటలకు మరియాపురంలోని కేథలిక్‌ చర్చిని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 6.30 గంటలకు బయలుదేరి తిరుమలలోని జీఎంఆర్‌ అతిథి గృహం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీ ఉదయం 8.30 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తారు. 10.30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 27వ తేదీ నుంచి యువగళం పాదయాత్రను నారా లోకేశ్‌ కుప్పం నుంచి ప్రారంభించనున్నారు.

కడపలో ఘనస్వాగతానికి తెదేపా శ్రేణుల సన్నాహాలు

ఈనాడు డిజిటల్‌, కడప: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు బుధవారం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. వైయస్‌ఆర్‌తో పాటు పరిసర జిల్లాల నుంచి నేతలు తరలిరానున్నారు.  ఇందులోభాగంగా మంగళవారం కడప నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి దేవుని కడప శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పాదయాత్ర నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.

పలమనేరులో లోకేశ్‌ బసకు స్థల పరిశీలన

పలమనేరు, న్యూస్‌టుడే: లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా రాత్రి బస కోసం చిత్తూరు జిల్లా పలమనేరులో నేతలు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 31న లోకేశ్‌ వి.కోటలో ప్రవేశిస్తారు. అనంతరం ఆయన బైరెడ్డిపల్లె మీదుగా పలమనేరుకు చేరుకుంటారు. ఆయన తన వాహనంలోనే రాత్రికి బస చేస్తారు. ఆ వాహనాన్ని ప్రైవేటు పట్టా భూముల్లోనే ఉంచాలని భావిస్తున్నారు. దాంతో పట్టణ పొలిమేరల్లోని క్యాటిల్‌ ఫారం నుంచి నక్కపల్లె వరకు ఉన్న భూములను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు