కృష్ణాలో వాటా తేల్చాలి

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 25 Jan 2023 04:49 IST

‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదాపై భాజపా వైఖరి స్పష్టం చేయాలి
నారాయణపేట బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌

నారాయణపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేళ్లు అవుతున్నా నేటికీ కృష్ణా జలాల వాటా తేల్చలేదన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీతో కలిసి మంగళవారం ఆయన రూ.196 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదిన సభ’లో కేటీఆర్‌ మాట్లాడారు. కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌కు ఓ ఉత్తరం రాయడానికి కూడా కేంద్రానికి తీరిక లేదన్నారు. పాలమూరు ఎండాలనే దురాలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. 813 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటాతేల్చలేదని, ఈ బేసిన్‌లోనే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్‌ మహానగరం ఉన్నాయన్నారు. నీళ్ల పంపకాలు చేపట్టకపోయినా ఉమ్మడి పాలమూరులో 11 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో అవసరాలు ఎక్కువ ఉన్నాయని రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ప్రధాని మోదీ పాలమూరులో ఏ ముఖం పెట్టుకుని పోటీచేస్తారు?

పాలమూరులో జరుగుతున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏవేవో అనవసర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఆ పార్టీ నాయకులకు దమ్ముంటే కృష్ణాజలాల్లో 500 టీఎంసీల వాటా కేటాయించాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే విషయంలో వైఖరిని స్పష్టం చేయాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మతాల మధ్య చిచ్చుపెడుతూ మసీదులు తవ్వుతామని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని మోదీ పాలమూరు జిల్లాలో పోటీ చేయాలని వాళ్ల రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారని.. ప్రధాని ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్‌లు కోర్టులో కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్నాయన్నారు. న్యాయ పోరాటం చేసైనా ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు.

పంచాయతీల వివాదం పరిష్కరించలేని వారు యుద్ధాన్ని ఆపారట..

రైతుల ఆదాయంపై కూడా పన్ను విధించాలని ప్రధాని మోదీ ప్రధాన ఆర్థిక సలహాదారు ఓ పత్రికలో వ్యాసం రాశారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని చెప్పారని, ఆదాయం ఎక్కడ పెరిగిందో చూపాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ మీద అదనంగా సెస్సులు వేసి రూ.30 లక్షల కోట్లు గుంజుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతో మీరేం చేశారని ప్రశ్నిస్తే జాతీయ రహదారులు, ఎయిర్‌ పోర్టులు నిర్మించామని చెబుతున్నారన్నారు. ప్రజలు చెల్లించిన టోల్‌ పన్ను డబ్బులతో వాటిని కట్టారని, తామేదో చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు పంచాయతీల వివాదం పరిష్కరించలేని వారు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మోదీ ఆపారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పనిమంతులకే పట్టం కట్టాలని, కేసీఆర్‌ నాయకత్వంలో మూడోసారి అధికారం చేపడదామన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజం కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

కేంద్ర పెద్దలు ప్రభుత్వ రంగ సంస్థలను ఇద్దరు గుజరాత్‌ బడా వ్యాపారులకు అమ్ముతున్నారు. తీరా అవి నష్టాల్లో ఉన్నాయని రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. దీనికి భాజపా నాయకులు సమాధానం చెప్పాలి. ఇది వాస్తవం కాకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మాఫీ చేసిన డబ్బుతో దేశంలోని రైతులందరికీ పదేళ్లు ఉచిత కరెంటు ఇవ్వొచ్చు. పేదలను కొడుతూ పెద్దలకు వడ్డిస్తున్న భాజపా కావాలో.. ఆసరా పింఛన్లు, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి.


అత్యంత అసమర్థ ప్రధాని మోదీ

‘‘దేశాన్ని పాలించిన 14 మంది ప్రధానులందరూ కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోదీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేళ్లలోనే రూ.వంద లక్షల కోట్లు అప్పులు చేశారు. మోదీ అంత అసమర్థ ప్రధాని మరొకరు లేరు. దేశంలోని ఒక్కో పౌరుడిపై రూ.1.25 లక్షల అప్పు భారం మోపారు’’

మంత్రి కేటీఆర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని