Nara Lokesh: సకల జనుల గొంతుకనవుతా

‘సైకో పాలనలో ఇబ్బందులు పడుతున్న సకల జనుల గొంతుకనవుతా.. ప్రజా సమస్యల పరిష్కారానికి సారథినవుతా.. యువతకు భవితనవుతా.. ఆడబిడ్డలను అన్నలా రక్షిస్తా.. మనవడిలా అవ్వాతాతల బాగోగులు చూస్తా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 26 Jan 2023 08:36 IST

యువతకు భవితనవుతా.. ఆడబిడ్డలను అన్నలా రక్షిస్తా..
మనవడిలా అవ్వాతాతల బాగోగులు చూస్తా..
ప్రజలంతా ‘యువగళం’ను ముందుండి నడిపించాలి
ప్రజలకు నారా లోకేశ్‌ బహిరంగ లేఖ
జగన్‌ది నియంతలను మించిన రాక్షస పాలనని ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘సైకో పాలనలో ఇబ్బందులు పడుతున్న సకల జనుల గొంతుకనవుతా.. ప్రజా సమస్యల పరిష్కారానికి సారథినవుతా.. యువతకు భవితనవుతా.. ఆడబిడ్డలను అన్నలా రక్షిస్తా.. మనవడిలా అవ్వాతాతల బాగోగులు చూస్తా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రను ప్రజలంతా ముందుండి నడిపించాలని... తనను ఆశీర్వదించి, ఆదరించాలని కోరారు. యువగళం పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు రక్షణ కల్పించి, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను జగన్‌రెడ్డి తన ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిపించే ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విభజన అనంతరం లోటు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని తెదేపా ప్రభుత్వం గాడినపెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేసింది. కానీ నేడు వైకాపా ప్రభుత్వం విధ్వంసాన్ని సాగిస్తోంది. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలూ మాకొద్దీ అరాచక పాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరవైంది. పరిశ్రమల యజమానుల్ని బెదిరించి రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తున్నారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. అప్పులు, మాదక ద్రవ్యాలు, రైతు ఆత్మహత్యలు, వలసల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపి ప్రజల్ని సిగ్గుతో తలదించుకునేలా జగన్‌ చేశారని మండిపడ్డారు. ‘ధాన్యం అమ్ముకోలేని రైతుల దైన్యం, ఉద్యోగాలు దొరక్క పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న యువత, పెరిగిన ధరలతో నిత్యావసరాలు కొనలేని సామాన్యులు, సకాలంలో జీతాలందని ఉద్యోగులు, బిల్లులు రాని గుత్తేదారులు ఇవన్నీ సైకో పాలన దుష్ఫలితాలు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్న జగన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ఆ లేఖలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు