పేదల బియ్యంలో కుంభకోణం

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం తథ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 04:29 IST

జనసేనతో పొత్తు కొనసాగుతుంది
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం తథ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని విమర్శించారు. కిలో బియ్యానికి కేంద్రం రూ.38 చెల్లిస్తుంటే.. రాష్ట్ర రూ.28తో నాసిరకం బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఆ బియ్యాన్ని వండుకుని తినలేక విధి లేని పరిస్థితుల్లో పేదలు విక్రయిస్తుంటే.. వాటిని కొందరు కొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదో పెద్ద కుంభకోణమని, ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ఒక పారిశ్రామిక విధానమంటూ లేకుండా పోయిందని, దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నింటి ధరలను పెంచి భక్తులను దోచుకుంటోందని.. ఇందుకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో చలో తిరుమల కార్యక్రమాన్ని చేపట్టి పాలక మండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 15వేల కి.మీ. పాదయాత్ర చేస్తామని, లక్ష ఛార్జిషీట్లు వేస్తామని తెలిపారు. రాష్ట్రంలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఒక ప్రశ్నకు జవాబుగా వీర్రాజు చెప్పారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని