వైకాపా మళ్లీ వస్తే వలసలే దిక్కు

రాష్ట్రంలో వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు వలసలే దిక్కని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Updated : 27 Jan 2023 08:53 IST

సీఎం జగన్‌ బెదిరింపులకు బెదిరేది లేదు
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ

హిందూపురం అర్బన్‌, లేపాక్షి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు వలసలే దిక్కని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక చిన్న మార్కెట్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచినా అభివృద్ధి జాడ కనపడటం లేదని, కేవలం ల్యాండ్‌, శాండ్‌, వైన్‌ అనే విధానాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పి.. పన్నుల రూపంలో బాదుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ‘రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం ఆగింది. యువత ఉపాధి లేక వలస పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బెదిరింపులకు భయపడేది లేదని, తనకు సైకాలజీ తెలుసని, ఉన్నది ఉన్నట్లు చెబుతున్నందునే తానంటే అందరికీ భయమని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ లోగా ఎన్నో కుట్రలు చేసే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని ప్రజలు బలపరచాలని కోరారు.

బాబాయ్‌ ఏఎన్‌ఆర్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది

‘తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్లలాంటివారు. ఎన్టీఆర్‌ తనకు తండ్రి అయితే..  ఏఎన్‌ఆర్‌ బాబాయ్‌ లాంటివారు. బాబాయ్‌పై ప్రేమ నా గుండెల్లో ఉంటుంది’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లిలో గురువారం ఆయన రూ.35 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రహదారి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే చిన్నతనం నుంచీ తనకెంతో అభిమానమని, ఆయనను తాను కించపరచలేదని, యాదృచ్ఛికంగా అన్న మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. తాడో పేడో అంటాం.. పేడో అంటే అర్థం ఏముంది? యాసతో అన్న మాటలకు దురర్థాలు తీయడం తగదని సూచించారు. ఏఎన్‌ఆర్‌కు తానంటే చాలా ఇష్టమని, ఆయన పిల్లల కంటే ఎక్కువగా చూసుకునేవారని చెప్పారు.

యువగళం విజయవంతానికి పిలుపు

యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. పాదయాత్రలో తాను పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అప్పుడప్పుడూ పాదయాత్రలో లోకేశ్‌ను కలుస్తుంటానని, సంఘీభావంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో యువతను ఒకచోటకు చేర్చి మహానాడు తరహాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు