Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు అస్వస్థత.. ప్రమాదమేమీ లేదన్న వైద్యులు

సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

Updated : 27 Jan 2023 16:04 IST

కుప్పం పట్టణం: సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తారకరత్నకు పల్స్‌ పడిపోవడంతో హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుప్పం ఆస్పత్రిలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన్ను పరామర్శించారు. తారకరత్నకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తేల్చారు.

లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానుల తాకిడికి ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు.

బయటకు తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్రలో అభిమానుల తాకిడితో తారకరత్న ఇబ్బంది పడ్డారు.  గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత కోరినా అభిమానులు వినకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షిస్తున్నారు.

వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు

అస్వస్థతకు గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరా తీశారు. తారకరత్నకు చికిత్స అందిస్తోన్న కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ‘‘తారకరత్నకు ప్రమాదం ఏమీ లేదు. యాంజియోగ్రామ్‌ నిర్వహించాం.  ముందు జాగ్రత్తగా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించాం’’ అని వైద్యులు చంద్రబాబుకు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని