దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి

దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) రాజ్యమేలుతోందని, న్యాయవ్యవస్థను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్‌ఓ)లో భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది.

Published : 28 Jan 2023 05:04 IST

మేమొస్తే దేశంలో ‘ప్రజాస్వామ్య షెహనాయీ’
కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జైరాం రమేశ్‌

ఖానాబల్‌: దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) రాజ్యమేలుతోందని, న్యాయవ్యవస్థను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్‌ఓ)లో భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ఇలాంటి ప్రమాదాల గురించి హెచ్చరించడమే జోడోయాత్ర ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది. జోడోయాత్ర కశ్మీర్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడారు. దేశంలో పెరిగిపోతున్న అసమానతలు, సమాజంలో సృష్టిస్తున్న విభజనలపై యాత్ర ద్వారా ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. ఆ విభజనలను రూపుమాపడమే ‘జోడో యాత్ర’ అని.. ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు. ‘సరిహద]్దుల్లో చైనాతో ఘర్షణ జరిగి రెండున్నరేళ్లయినా పార్లమెంటులో ఇప్పటి వరకు చర్చ జరగలేదు. పార్లమెంటు, రాజ్యాంగ సంస్థలు ప్రస్తుత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రోజూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా న్యాయవ్యవస్థను బలహీనపరిచి పీఎమ్‌ఓలో భాగం చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు.’ అని భాజపాపై విమర్శలు గుప్పించారు.

ప్రజల ముందు రెండు దారులున్నాయి

ఇప్పుడు ప్రజల ముందు రెండు దారులున్నాయని జైరాం రమేశ్‌ వివరించారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘ఒకే వ్యక్తి- ఒకే వ్యవస్థ’ ఒక మార్గం అయితే.. శాంతికి పాటుపడే కాంగ్రెస్‌, గాంధీ, రాహుల్‌ గాంధీల మార్గం మరొకటని సూచించారు. రెండో దారిని ఎంచుకుంటే దేశంలో ‘ప్రజాస్వామ్య షెహనాయీ’ వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని