Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?

భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్‌జీతో భేటీ అయ్యారు.

Updated : 28 Jan 2023 08:41 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్‌జీతో భేటీ అయ్యారు. విజయవాడలో శుక్రవారం రాత్రి దాదాపు గంటన్నరపాటు జరిగిన వీరి భేటీలో సోము వీర్రాజుపై కన్నా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల దిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు, భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన.. శివప్రకాష్‌జీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో కన్నా.. సోము వీర్రాజు వైఖరి గురించి వివరించినట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పుపై ఎవరినీ సంప్రదించలేదని, దీని వల్ల కొందరు రాజీనామాలు చేశారని వివరించినట్లు సమాచారం. శివప్రకాష్‌ జీ.. తాను పార్టీ నేతల నుంచి సేకరించిన సమాచారంపై కన్నా నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. సమావేశానంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర భాజపాలోని ప్రస్తుత పరిస్థితులపైనే శివప్రకాష్‌ జీతో చర్చించా. సోము వీర్రాజు మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇటీవల నేను చేసిన కామెంట్లపై కూడా చర్చ జరగలేదు’ అని పేర్కొన్నారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి సోము వీర్రాజునే అడగాలన్నారు. పార్టీ మారడం లేదని తాను చెప్పినా.. మీడియా పదేపదే అదే ప్రస్తావిస్తోందని ఆరోపించారు. జనసేన నేత నాదెండ్లను ఓ స్నేహితునిగా కలుసుకోవడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న నేతలున్నారని, అలాంటి వారికి అవమానాలు జరుగుతున్నాయని, నరసరావుపేట జిల్లా అధ్యక్షుని విషయంలో అదే జరిగిందని వెల్లడించారు. ఇలాంటి కారణాల వల్లే పెదకూరపాడులో కొందరు రాజీనామా చేశారని, అయితే ఆ రాజీనామాల గురించి కూడా శివప్రకాష్‌ జీతో జరిపిన భేటీలో చర్చించలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని