రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్‌

రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తుల మధ్య వివాదాలు దేశ ప్రయోజనాలకు దెబ్బ అని, తెలంగాణలో రిపబ్లిక్‌డే రోజున సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని అవమానపరిచారని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపించారు.

Published : 28 Jan 2023 05:04 IST

పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తుల మధ్య వివాదాలు దేశ ప్రయోజనాలకు దెబ్బ అని, తెలంగాణలో రిపబ్లిక్‌డే రోజున సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని అవమానపరిచారని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘనంగా జరుపుకోవాల్సిన రిపబ్లిక్‌డే ఉత్సవాలను కేసీఆర్‌ అహంభావంతో రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం శోచనీయమని, సీఎం, మంత్రులు రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి హాజరుకాకపోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. తెలంగాణలో గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవంపై ప్రభావం చూపాయన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

కేంద్ర జౌళిశాఖ మంత్రికి మల్లు రవి లేఖ

హైదరాబాద్‌లోని జాతీయ జనపనార(జూట్‌ బోర్డు) మండలి కార్యాలయాన్ని కోల్‌కతా కార్యాలయంలో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందని, అలా చేయవద్దని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాల ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనపనార ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసేవారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తయారీదారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హైదరాబాద్‌పై ఆధారపడి ఉన్నారని రవి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని