చిత్రహింసలు పెట్టినప్పుడుచట్టం గుర్తు లేదా?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించాలని, విచారణ ప్రక్రియను వీడియో తీయాలని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరడాన్ని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తప్పుబట్టారు.

Published : 29 Jan 2023 03:36 IST

అవినాష్‌రెడ్డికో చట్టం..ప్రతిపక్ష నేతలకు మరో చట్టమా?
ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించాలని, విచారణ ప్రక్రియను వీడియో తీయాలని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరడాన్ని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తప్పుబట్టారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి.. కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసినప్పుడు, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును రాత్రికి రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినప్పుడు వైకాపా నేతల నోళ్లు మూతపడ్డాయా? అని నిలదీశారు. ఏపీ పోలీసులకు ఓ నియమం, సీబీఐకి మరో నియమమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వపక్షానికి ఒకలా... విపక్షానికి మరోలా చట్టాలు ఉంటాయన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘మూడున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు, సీఐడీ వేధిస్తున్నప్పుడు వీరికి చట్టాలు గుర్తుకు రాలేదు? తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇంటి గోడ దూకి అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్న పాత్రుడు, చింతమనేని ప్రభాకర్‌, జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేసి వేధింపులకు గురి చేసినప్పుడు ఇవి గుర్తుకు రాలేదా? సొంత పార్టీ నేతదాకా వచ్చే సరికి ఆ నొప్పి తెలిసిందా’ అని కేశవ్‌ నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని