విపక్ష కూటమికి ఆధారం కాంగ్రెస్సే

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అంటూ ఏదైనా ఆవిర్భవిస్తే దానికి కాంగ్రెస్సే మూలాధారం కావాలని.. అది భాగస్వామిగా లేని కూటమికి అర్థం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 05:14 IST

మా పార్టీ భాగస్వామ్యం లేకుండా భాజపాపై పోరాటం సఫలమవ్వదు
సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్య
జోడో యాత్ర తరహాలో మరో కార్యక్రమం!
ఈ సారి గుజరాత్‌ నుంచి అరుణాచల్‌కు

అవంతిపొరా: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అంటూ ఏదైనా ఆవిర్భవిస్తే దానికి కాంగ్రెస్సే మూలాధారం కావాలని.. అది భాగస్వామిగా లేని కూటమికి అర్థం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి రాష్ట్రంలో సొంతంగా పోటీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ, విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిందేనని తెలిపారు. ‘రాష్ట్రాల్లో మేం అధికారంలో లేకపోవచ్చు గానీ.. ఏ గ్రామంలో, వీధిలో, పట్టణంలో, నగరంలో చూసినా కాంగ్రెస్‌ కార్యకర్తలు, కాంగ్రెస్‌ కుటుంబాలు కనిపిస్తాయి’ అని చెప్పారు. ‘భాజపా అధికారంలో ఉండొచ్చు. కానీ ఉనికి రీత్యా చూస్తే కాంగ్రెస్‌ మాత్రమే ఏకైక జాతీయపార్టీ. కాంగ్రెస్‌ సిద్ధాంతం మధ్యేవాద-వామపక్ష భావజాలంతో ఉంటుంది. ప్రతిపార్టీ ఆలోచనలూ ఇటే ఉంటాయి. అందుకే మేం మూలాధారం లాంటి వాళ్లం. భాజపాతో పోరాడాలంటే కాంగ్రెస్‌తో కూడిన కూటమే ఉండాలి’ అని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. కేవలం భాజపా వ్యతిరేకతో, ప్రభుత్వ వ్యతిరేకతో సరిపోదని, నిర్మాణాత్మక అజెండా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ఒక్కటే భాజపాపై పోరాడాలని తనకు ఉంది గానీ, 2024లో అది అంత వాస్తవికత కాదని ఆయన చెప్పారు.

పార్టీ నిర్మాణానికే తొలి ప్రాధాన్యం

కొన్ని రాష్ట్రాల్లో తన మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది పార్టీ నిర్మాణానికి నష్టదాయకమని జైరాం రమేశ్‌ తెలిపారు. ముందు పార్టీని నిర్మిస్తే అధికారం దానంతట అదే వస్తుందన్నది రాహుల్‌గాంధీ ప్రధాన సందేశమని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ దాన్ని ఉల్టా చేసిందన్నారు. దీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల పార్టీ నిర్మాణం దెబ్బతిందని, భారత్‌ జోడో యాత్రతో నూతన జవసత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యాత్ర ఒక కార్యక్రమం కాదు.. ఉద్యమమన్నారు. పార్టీలో అంతర్గత కొట్లాటలు సరికాదని చెప్పారు. వ్యక్తిగత లక్ష్యాలు కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ నష్టమే చేస్తాయని పేర్కొన్నారు. జోడో యాత్రతో సమష్టితత్వం, సోదరభావం మెరుగయ్యాయని.. రాజస్థాన్‌లోనూ అది కనపడిందని అశోక్‌ గహ్లోత్‌-సచిన్‌ పైలట్‌ వివాదాన్ని ప్రస్తావించినప్పుడు సమాధానమిచ్చారు. అయిదు నెలల క్రితం కంటే ఇప్పుడు కాంగ్రెస్‌ గురించి ప్రజలు బాగా మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీని పప్పు అని భాజపా నేతలు అనడం మానకపోవచ్చని, వాళ్లు కేవలం పేరు చెడగొట్టడంపైనే దృష్టిపెట్టారని విమర్శించారు. యాత్ర వల్ల రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ ప్రతిష్ఠ కూడా బాగా పెరిగిందని చెప్పారు.

మదిలో మరో యాత్ర...

జోడో యాత్ర కొనసాగింపుగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని పరశురామ్‌ కుండ్‌ వరకు మరో పాదయాత్ర చేయాలన్నది తన అభిప్రాయమని, ఆ విషయంలో పార్టీయే ఒక నిర్ణయం తీసుకోవాలని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరాం రమేశ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని