Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping)పై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated : 01 Feb 2023 15:22 IST

నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైకాపా (YSRCP) నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాప్‌ (Phone Tapping) చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు సహా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కోటంరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైకాపా నుంచి పోటీకి నా మనసు అంగీకరించట్లేదు

‘‘ఇలాంటి ప్రెస్‌మీట్‌ పెడతానని అనుకోలేదు. వైఎస్‌కు, జగన్‌కు ఎంత  వీరవిధేయుడినో అందరికీ తెలుసు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాడా. వైకాపా అధికారంలోకి వచ్చాక గుర్తింపు లేకపోయినా బాధపడలేదు. పార్టీ గురించి నేనెక్కడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. నేనెప్పుడూ జనంలోనే ఉన్నా. కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘాపెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా. నా ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్‌ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట నేనుండలేను. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.

అవి సీఎం మాటలుగా భావిస్తున్నా..

నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, సీజే, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేస్తారు. మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఎలా ఉంటుంది?సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్‌ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? తప్పు చేసి ట్యాపింగ్‌ జరగలేదని చెబుతారా? నేను ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది.

ఇంతకంటే ఆధారాలేం కావాలి?

కొన్ని రోజుల క్రితం నా బాల్య మిత్రుడితో ఐఫోన్‌లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు అడిగారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నాకు ఆడియో క్లిప్‌ పంపారు. ట్యాపింగ్‌ చేశారనడానికి ఇంతకుమించి ఆధారాలేం కావాలి? ఫోన్‌ ట్యాపింగ్‌ కాకుండా ఆడియో క్లిప్‌ ఎలా బయటకు వచ్చింది? రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ ట్యాప్‌ చేయకుండా ఎలా వచ్చింది? 9XXXXX6000 నంబర్‌ నుంచి ఆడియో క్లిప్‌ వచ్చింది.. ఆ నంబర్‌ ఎవరిదో చెక్‌చేసుకోండి. ఏసీబీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు ఆ నంబర్‌ను వాడుతున్నారు. నేను ట్యాపింగ్‌ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండి. ట్యాపింగ్‌పై కేంద్రహోంశాఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా. దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని వారి ఫోన్లను ట్యాప్‌ చేస్తారు. ఫోన్లు ట్యాప్‌ చేస్తే కాపురాలు నిలబడతాయా? ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తుంటే ఇంకెవరికి చెబుతాం. దీనిపై అందరూ ఆలోచించుకోవాలి. 

తెదేపా తరఫున పోటీ చేయాలనుంది..

ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్ధారణ అయ్యాకే నా ప్లాన్‌ నేను చేసుకుంటున్నా. భవిష్యత్‌ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తా. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు.. అందుకే ట్యాపింగ్‌ను బయటపెట్టా. బాలినేని వద్దకు మా తమ్ముడు స్వయంగా వెళ్లలేదు. ఆయన పిలిస్తేనే వెళ్లారు. ఐబీ చీఫ్‌ తనంతట తాను నాతో మాట్లాడారని అనుకోవట్లేదు. పార్టీ పెద్దలు చెబితేనే ఆయన నాతో మాట్లాడారని అనుకుంటున్నా. నేను ఇటీవల సీఎంను కలిసిన సమయానికి ట్యాపింగ్‌ ఆధారం నా వద్ద లేదు. రాష్ట్రంలో వంద మందికి కేబినెట్‌ హోదా ఉంది. పార్టీ తరఫున నాకు ఏ గౌరవం ఇవ్వలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నారు. ఐబీ చీఫ్‌ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారని నేను అనుకోలేదు. ట్యాపింగ్‌ అంశంలో అధికారులను తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రభుత్వ పెద్దలు చెబితేనే ట్యాపింగ్‌ జరుగుతుంది. భవిష్యత్‌ కార్యాచరణ ఏంటని కార్యకర్తలు అడిగారు.. తెదేపా తరఫున పోటీ చేయాలని ఉందని వారితో చెప్పా. ఈ విషయంలో నిర్ణయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుది’’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని