Buggana: సీఎం ఎక్కడుంటే అదే పరిపాలన రాజధాని: బుగ్గన

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే పరిపాలన రాజధాని అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలన రాజధాని ఉంటుందని, రాజ్యాంగంలో రాజధాని అనే ప్రత్యేక పదం లేదని వెల్లడించారు.

Updated : 02 Feb 2023 08:57 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే పరిపాలన రాజధాని అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలన రాజధాని ఉంటుందని, రాజ్యాంగంలో రాజధాని అనే ప్రత్యేక పదం లేదని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్దేశం గతంలోనే చెప్పామని, మొదటి నుంచి ఇదే చెబుతున్నామని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి పాలించినచోటే రాజధాని

శాసన సభాపతి సీతారాం

అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలన కొనసాగిస్తే అదే రాజధాని అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అందరూ స్వాగతించాలి. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయి’ అని అన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనడం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమని సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఆయన 35 మంది మంత్రుల, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నాయని అంటున్నారుగా.. వారి పేర్లు బహిర్గతం చేయమనండి అని అన్నారు.

కేంద్రంతోనే 3 రాజధానుల బిల్లు పెట్టిస్తాం: మాజీ మంత్రి కొడాలి నాని ‘రాష్ట్ర రాజధాని నిర్ణయం ఒకసారి అయిపోయింది, ఇప్పుడు మూడు రాజధానులను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు చెబితే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వారితోనే మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కోర్టు చెప్పినా.. 3 రాజధానులకు అనుకూలంగా ఉండేవారికే కేంద్రంలో మద్దతునిస్తాం. వికేంద్రీకరణకు అనుకూలంగా రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలనూ ఒక పార్టీ గెలిస్తే, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం అడిగింది చేయకుండా ఉండగలదా? మోదీ ఉన్నా, ఇంకొకరున్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిందే కదా?’ అని వ్యాఖ్యానించారు. మే లేదా ఆగస్టులో సీఎం తన కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తానని చెప్పారని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు