సొంత ఎమ్మెల్యేల్నీ నమ్మలేని స్థితిలో జగన్‌

రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియా సంస్థల అధిపతులు, న్యాయమూర్తులు, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న వారి ఫోన్లు ట్యాప్‌ చేస్తూ వారిని దారికి తెచ్చుకోవాలని చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

Updated : 03 Feb 2023 06:20 IST

పెద్దిరెడ్డే ట్యాపింగ్‌ చేస్తున్నామని అంగీకరించారు
దీనిపై కేంద్ర నిఘా సంస్థతో దర్యాప్తు జరపాలి
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియా సంస్థల అధిపతులు, న్యాయమూర్తులు, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న వారి ఫోన్లు ట్యాప్‌ చేస్తూ వారిని దారికి తెచ్చుకోవాలని చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలతో ఈ విషయం మరోసారి రుజువైందని అన్నారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేల్నీ నమ్మలేని స్థితికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దిగజారారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌పై 2020, ఆగస్ట్‌ 1న ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు. ‘కేవలం అభియోగాల మీదే కేసులు పెట్టకుండా ప్రభుత్వం నిశితంగా విచారణ చేసి.. వారి ఫోన్‌ కాల్స్‌ ట్యాప్‌ చేసి.. బాధ్యుల్ని అరెస్టు చేశాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. దీన్నిబట్టే ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా? లేదంటే జగన్‌ రాజీనామా చేయగలరా?’ అని పట్టాభిరామ్‌ సవాల్‌ విసిరారు. సీఎంకు తెలియకుండా ట్యాపింగ్‌ జరుగుతుందా అని ప్రశ్నించారు. ‘నాడు పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌తో తెదేపా ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని నిరాధార ఆరోపణలు చేసిన ఈ సర్కారుకు.. నేడు తమ నిజాయతీ నిరూపించుకునే దమ్ముందా?’ అని అన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ లోతైన దర్యాప్తు చేయాలి’’ అని పట్టాభి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు